‘ఆచార్య ఆత్రేయ’ అంటారుగానీ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహా చార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా ఉచ్చూరు అగ్రహారం. అక్కడికి పక్కనే ఉన్న మంగళంపాడులో సీతమ్మ- కృష్ణాచార్యుల దంపతులకు జన్మించారు.
ఆత్రేయది పండిత వంశం. ఆయన మేనమామ పద్యకవి. ఆ ప్రభావం ఆత్రేయ మీద కూడా పడింది. వారిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. తండ్రిగారు నిష్టాగరిష్టుడు. ఆచార వ్యవహారాలకూ సంప్రదాయాలకూ విలువ ఇచ్చే మనిషి. ఆ అగ్రహారానికి ఆయనే పెద్ద. అరవై ఎకరా ఆసామి. ఆ ఊరికి ఆయన మాటే వేద వాక్కు. ఆత్రేయ ఎస్సెల్సీ చదివేటప్పుడు ఓ అనుకోని సంఘటన జరిగింది. ఆ పక్క ఊరు మంగళంపాడులోకి ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి అడుగుపెట్టింది. అసలే ఆత్రేయ నూనూగు మీసాల నూతన యవ్వనంలోకి కాలు పెట్టాడు.
ఆ అమ్మాయి పేరు బానం. ఆమె ఊళ్లోని చుట్టాలింటికి వచ్చింది. ఆమె చెంగు చెంగున ఎగురుతూ ఆత్రేయ కంటపడనే పడింది. మాటలు కలవకపోయినా ఇద్దరి చూపులూ కలిశాయి. ఏదో తెలియని అనుభూతి ఇద్దరికీ కలిగింది. అప్పుడు ఆత్రేయ వయసు 16, ఆమె వయసు 14. విషయమేమిటంటే పిల్లకు ఈడొచ్చిందిని ఆమె తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు కూడా చూస్తున్నారు. ఆ మాటలు చెవిన పడ్డాయి ఆత్రేయకు. పిల్ల మనసుకు నచ్చింది.. మాటామాటా కలిసింది. ఇద్దరిలోనూ తొలివలపు అంకురించింది. ఆ తొలివలపు ఎంత తీయగా ఉంటుందో ఆత్రేయకు అనుభవపూర్వకంగా తెలిసింది.
వారు చేసుకున్న బాసలు.. చెప్పుకున్న ఊసులు ఆనోటా ఈనోటా చేరి ఆత్రేయ తండ్రిగారి చెవిన పడ్డాయి. ఆయనసలే ఆగ్రహారం మనిషి… ఆగ్రహోదగ్రుడయ్యాడు. దానికి ఊరూ వంతపాడింది. కారణం ఆ ప్రేమికులిద్దరి గోత్రమూ ఒక్కటే. అంత గొప్ప వంశంలో గోత్రమే వారి పెళ్లికి అడ్డుపడింది. వారిది ఆత్రేయస్య గోత్రం. ఆ గోత్ర నామమే ఆత్రేయకు పేరుగా మారింది. చివరికి ఊరంతా ఒక్కటై ఆ ప్రేమజంటను విడదీసింది. ఆ ప్రేమ గాయమే గుండెలోతుల్లోకి దిగి ఆత్రేయలోని కవిని మేల్కొలిపింది. అదే ‘తొలి గాయం’ పేరుతో ఆయన ఓ పద్య కావ్యం రాయటానికి దారితీసింది. మన్మధుడే చెరో పక్క బాణాలేసి ఇద్దరినీ ప్రేమకి పురిగొల్పాడు అంటారు ఆత్రేయ. ప్రేమలో ఇద్దరం సమ ఉజ్జీలమేనని ఆయన తన రచనలో పేర్కొన్నారు.
‘ఈ ఊరివారికి ఆ ఊరు కూత వేటు దూరంలో ఉండటంవల్ల వ్యాహ్యాళికని సాయంత్రం షికారుకెళ్లగా క్రొక్కారు మెరుపులా కనిపించింది’ అని తన తొలివలపు గురించి ఆయన పేర్కొన్నారు. ప్రేమ గాయం వల్ల ప్రేరేపితుడైన పద్య కవి ఆత్రేయ. ఆయన పద్య కవి ఆనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియనే తెలియదు. ఆ పద్య కావ్యాన్ని కవిసార్వభౌమ విశ్వనాథ సత్యనారాయణకు చూపించి ఆయన ప్రశంసనూ, ఆశీస్సులనూ అందుకున్నాడు. అలా తన ఆరాధ్య దేవత బానం చేసిన ప్రేమ గాయం ఆయనలో ఎంతో సంఘర్షణనూ, ఆ సంఘర్షణలో నుంచి జ్ఞానామృతాన్నీ పొందేలా చేసింది.
బానంతో ప్రేమలో పడటం వల్ల ఇహ లాభంలేదనుకుని తల్లిదండ్రులు ఓ పిల్లను చూసి ఆత్రేయ పెళ్లి చేసేశారు. తండ్రి మాటకు ఎదురుచెప్పలేకపోయారు. ఆయన మనసు కవిగా మారడం వెనక ఈ ప్రేమ ప్రభావం ఎంతైనా ఉండి తీరుతుంది. ‘మనసు గతి ఇంతే.. మనిషి బ్రతుకింతే.. మనసున్న మనిషికి బ్రతుకులేదంతే’ అంటూ ఆయన రాసిన పాట జనంలోకి ఎంతగా వెళ్లిపోయిందో అందరికీ తెలుసు. దాదాపు 400 చిత్రాలకు పాటలు, మాటలు ఆయన రాశారంటే ఆయన మనసు ఎలా స్పందిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
దీని ‘శిఖ’ దరగా..!
ఆత్రేయ ఎంత అగ్రహారం కుర్రాడైనా ఆయనలో నవీన భావాన్నాయి. అతనిలోని ఆ భావాను మేల్కొలిపిన మహానుభావుడు మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ రాసిన ప్రతి రచనా ఆత్రేయ చదివేవాడు. పట్నంలో జరిగే శ్రీశ్రీ సభలు, సమావేశాకు ఆత్రేయ హాజరయ్యేవాడు. దాంతో నవీన భావాలు కాస్తా విప్లవ భావాలుగానూ మారాయి. అగ్రహారం కుర్రాడు కావడంతో ఆయన నెత్తి మీద పిలక ఉండేది. దాన్ని అక్కడ కుదిమ, ముడి, శిఖగా వ్యవహరించేవారు. అసలే శ్రీశ్రీ ఆవహించి ఉన్న ఆత్రేయ దృష్టి ఒక్కసారిగా తన శిఖ మీద పడిరది. ‘దీని శిఖ దరగా’ అనుకుని దాన్ని కాస్తా కత్తిరించి పారేశాడు.
పట్నంలో ముస్తాబై టింగురంగా అంటూ అగ్రహారంలోకి అడుగుపెట్టగానే తండ్రి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ‘నీ తండ్రి చచ్చాడనుకున్నావురా..’ అంటూ ఆయన మండిపడ్డాడు. ‘మన ఆచారమేంటి.. మన మేంటి..’ అని ఆయన అంటుండగానే మధ్యలోనే అడ్డుకున్నాడు ఆత్రేయ. అసలే యువరక్తం.. ఆపై శ్రీశ్రీ అక్షర రక్తం…‘ ఆ ఆచారమే మీకు అంత అవసరమైనప్పుడు నేనే మీ అగ్రహారాన్ని బహిష్కరిస్తున్నాను’ అనేసి వెనుదిరిగాడు. పంతానికి అలా అన్నాడేకానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఏంచేయాలో తెలియదు.
పెళ్లి చేసుకున్నాడన్న మాటేగాని ప్రేమను మాత్రం ఆమెకు పంచలేకపోయాడు. అప్పటికే వీడు మాట వినటంలేదనుకున్న తండ్రి తన ఆస్తినంతా కోడలి పేరున పెట్టేశాడు. తండ్రి ఆగ్రహం ఆత్రేయలో పట్టుదలను మరింత పెంచింది. తనకు ఆ ఇంటితోనూ ఆ ఊరితోనూ బంధం తెగిపోయిందనుకున్నాడు. అలా గమ్యం తెలియని బాటసారిలా నెల్లూరు చేరాడు. పిలక పోయినా కొత్త ఆశల మొలక కోసం అంతరంగంలో అన్వేషణ ప్రారంభించాడు.
రమణా రెడ్డి ఇచ్చిన ఆ పావలా..!
నెల్లూరులోని ఓ పార్కులో సిమెంటు బెంచీ మీద దీనంగా కూర్చున్నాడు ఆత్రేయ. అది సాయం సంధ్యా సమయం. గెడ బొంగులా ఉండే మరో యువకుడి దృష్టి ఈ కుర్రాడి మీద పడింది. పరిచయమున్న ముఖమే. ‘అరె…ఏంటి ఇతను ఇలా ఏదో పోగొట్టుకున్న వాడిలా కూర్చున్నాడు.. ఏం జరిగి ఉంటుంది ?’ అనుకున్నాడు ఆ పొడవాటి కుర్రాడు. అతను మరెవరో కాదు ఒకనాటి ప్రముఖ హాస్యనటుడు రమణారెడ్డి. అప్పటికే మద్రాసులో సినిమాల్లో నటిస్తున్నాడు. సొంతూరు నెల్లూరే కాబట్టి వచ్చినప్పుడల్లా ఆ పార్కును సందర్శించటం అవాటు. ఆత్రేయ ఫలానా మోతుబరి, అగ్రహారం పెద్దాయన కుమారుడని, నిరతాన్నదానం చేసే సీతమ్మ కుమారుడని తెలుసు.
పైగా అతను నాటకాభిమాని. తన ప్రదర్శనకు తరచూ వచ్చేవాడు. అలా కొద్దిపాటి ముఖ పరిచయం కూడా ఉంది. అందుకని దగ్గరికి వెళ్లి ‘‘ఏంటి ఏదోలా ఉన్నావు. ఏం జరిగిందేమిటి?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో గొడవపడి ఇలా వచ్చేశాను’’ అని చెప్పాడు ఆత్రేయ. ‘‘మరి ఏం చేద్దామనుకుంటున్నావు?’’ అనగానే ‘‘నా బాట నాటక రంగమే’’ అని బదులిచ్చాడు. ‘‘సరే ఇదుంచు ’’ అంటూ ఓ పావలా చేతిలో పెట్టాడు రమణారెడ్డి. తన చేతికొచ్చిన పావలాలో అణా (ఆరు పైసు) పెట్టి బన్ను, టీ కొన్నాడు. ఓ బేడ (12పైసు) పెట్టి పెన్సిలు, బ్రౌను పేపరు కొన్నాడు. ఇంకా జేబులో ఆణా మిగిలింది. బన్ను తిని, టీ తాగి ఆకలి బాధ కొద్దిగా చల్లార్చుకున్నాడు.
చీకటి పడింది.. పార్కులో ట్యూబ్ లైటు వేశారు. బ్రౌను పేపరు మీద కలం కదిలింది. తెల్లవార్లూ కంటి మీద కునుకులేకుండా రాస్తూనే ఉన్నాడు. అంతా లోపలి నుంచి ప్రవాహంలా వచ్చేస్తోంది. సూర్యుడు ఉదయించేసరికి ఆయన రాస్తున్న నాటకం పూర్తయింది. అదే ‘గౌతమ బుద్ధ’ నాటకం. రాజమండ్రిలో కొండపల్లి వీర వెంకయ్య అనే ప్రచురణకర్త ఉండేవారు. ఆయనకు న్లెూరులో ఓ బ్రాంచి కూడా ఉంది. అప్పుడప్పుడూ ఆయన నెల్లూరుకు వచ్చిపోతుండేవారు. ఆత్రేయ అదృష్టమేమో ఆ రోజు ఆయన నెల్లూరులోనే ఉన్నారు. ఆత్రేయ వెళ్లి కలిశాడు. ఆ నాటకానికి అయిదు రూపాయలకు మించి ఇవ్వనన్నాడాయన. అదే పదివేలు అనుకున్నాడు ఆత్రేయ.
ఆ నాటకానికి వచ్చిన ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. చూసిన వారంతా ‘ఆహా’ అన్నారు. దాంతో ఆత్రేయ మనసు పూర్తిగా నాటకాల వైపు మళ్లింది. రమణారెడ్డి ఇచ్చిన ఆ పావలా ఓ మహారచయితను భావితరానికి అందించింది. అందుకేనేమో రమణారెడ్డి ప్రస్తావన వస్తే ‘‘ఆ రోజు దేవుడే నన్నొచ్చి పలకరించినట్లయింది’’ అంటుంటారు ఆత్రేయ. అలా నాటక రంగంలో ఆత్రేయకు అనుబంధం ఏర్పడింది. నెల్లూరు మున్సిఫ్ కోర్టులో తిరుత్తరణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమస్తాగా సేవలందించారు. ఆ తర్వాత నెల్లూరు నుంచి వెలువడే ‘జమీన్ రైతు’పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ఓటు నీకే, కళకోసం, చస్తే ఏం?, ఆత్మార్పణ, కాపలావాని దీపం, చావకూడదు, తెరచిన కళ్లు, ప్రగతి, మాయ, వరప్రసాదం.. ఇలా ఎన్నో నాటికలు, నాటకాలు ఆయన కలం నుంచి ప్రాణం పోసుకున్నాయి.
‘ఎన్జీవో’, ‘కప్పలు’ నాటకాలు పెద్ద హిట్టు. వాటిలోని డైలాగులు వన్స్ మోర్ కొట్టించేవి. అలా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తండ్రిగారైన కె.ఎస్. ప్రకాశరావు పిలుపుమేరకు సినిమా రంగంలో అడుగుపెట్టారు ఆత్రేయ. తొలిసారిగా 1951లో ‘దీక్ష’ సినిమా కోసం ‘పోరా బాబు పో… పోయి చూడు లోకం పోకడ..’ అనే పాటతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. మనసు కవిగా, మన సుకవిగా ఆత్రేయ ప్రస్థానం అనన్య సామాన్యం.











