అల్లు అర్జున్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే, మరో రెండు ప్రాజెక్టులను ఆయన లైన్లో పెట్టేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ ఉండటం వలన, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కథపై గల నమ్మకంతో, బన్నీ పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమా తరువాత బన్నీ రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో పట్టాలెక్కనుంది. ‘పుష్ప’ తరువాత బన్నీ .. ‘ఆచార్య’ తరువాత కొరటాల చేసే సినిమా ఇదే. ఈ ప్రాజెక్టులో నటీనటులకు సంబంధించిన ప్రక్రియ మొదలైపోయిందని తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం సయీ మంజ్రేకర్ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరాఠీ నటుడు .. దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తెనే ఈ అమ్మాయి.
‘సయీ మంజ్రేకర్’ పేరు వినగానే ఇంతకుముందు ఈ అమ్మాయి పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే అనిపించడం సహజం. నిజంగానే విన్నారు .. వరుణ్ తేజ్ జోడీగా! .. లాక్ డౌన్ కి ముందు వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ‘సయీ మంజ్రేకర్’ ను తీసుకున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ అమ్మాయి, కొరటాల సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం విశేషమేనని అనుకోవాలి .. పైన జరుగుతున్న ప్రచారం నిజమే అయితే!











