ముందుగా త్రివిక్రమ్ రచయిత .. ఆ తరువాతనే దర్శకుడు. అందువలన తన సినిమాలకి సంబంధించిన కథలను ఆయనే అందంగా అల్లుకుంటాడు .. ఆసక్తికరంగా మలచుకుంటాడు. ఆయన సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రయోజనం ఉంటుంది .. ఆ పాత్ర స్వరూప స్వభావాల విషయంలో ఆయనకి పూర్తి స్పష్టత ఉంటుంది. టైటిల్ విషయంలోను అంతే .. కథాకథనాలను బట్టి టైటిల్ పొడవుగా పెట్టడం .. షార్టు కట్ లోను టైటిల్ ను సెట్ చేయడం ఆయనకే చెల్లింది. అలాంటి త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా చేయనున్నాడు.
పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి త్రివిక్రమ్, ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను సెట్ చేశాడు. ‘మహాభారతం’లో కౌరవులతో ‘సంధి’ చేసుకురావలసిన బాధ్యతను పాండవులు కృష్ణుడికి అప్పగిస్తారు. యుద్ధం తప్పదని తెలిసిన కృష్ణుడు, అందుకు సిద్ధంగా ఉండమని పాండవులకు ముందస్తు హెచ్చరిక చేస్తూ హస్తినాపురానికి బయల్దేరతాడు. ఆ సమయంలో చెప్పే మాటగా ‘అయినను పోయిరావలె హస్తినకు’ వినిపిస్తుంది. ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయింది .. ఈ నాటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.
అందుకే త్రివిక్రమ్ మంచి టైటిల్ సెట్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో ‘చౌడప్పనాయుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ జొరబడింది. రెండు మూడు రోజులుగా ఇదే వార్త షికారు చేస్తోంది. అయితే ఫ్యాక్షన్ తరహా టైటిల్స్ త్రివిక్రమ్ స్టైల్ కానే కాదు. అందువలన చాలామంది నమ్మలేదు. అనుకున్నట్టుగానే ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ అసలు పరిశీలనలోనే లేదనీ, ఫస్టు అనుకున్న టైటిలే ఫైనల్ అనే మాట త్రివిక్రమ్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.