మనం సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వెబ్ సైట్ బుక్ మై షో ఈ ఏడాది టాప్ టెన్ చిత్రాల జాబితాను విడుదల చేసింది. వాటిలో మన తెలుగు చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అగ్రస్థానంలో ఉన్న చిత్రాల జాబితాలో అగ్రస్థానం మాత్రం అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’కి దక్కింది. ఆ తర్వాత విజయ్ ‘మాస్టర్’, హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ ఉన్నాయి.
వీటి తర్వాత మాత్రం మన తెలుగు సినిమాలు ఆ ఘనతను సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నట సింహం బాలయ్య ‘అఖండ’ కూడా అగ్రస్థానంలో వాటితో పోటీ పడ్డాయి. డాక్టర్, ఉప్పెన, అన్నాత్తే, లవ్ స్టోరీ, కురుప్ చిత్రాలు టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన దేశంలో విడుదలైన అన్ని చిత్రాలనూ లెక్కలోకి తీసుకుని బుక్ మై షో ఈ జాబితా తయారుచేసింది.
రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ ల ద్వయం మాస్ పై గట్టి ప్రభావాన్నే చూపారు. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 290 కోట్ల వసూళ్లను సూర్యవంశ్ సాధించింది. ఈ కోరోనా యుగంలో ఈ మొత్తం తక్కువేం కాదు. ఇక దక్షణ భారతదేశంలో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇది కూడా సూర్యవంశ్ కు ధీటుగా వసూళ్లు సాధించింది. స్పైడర్ మాన్ నో వే హోమ్ చిత్రం ఇండియాలో రూ. 167 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 638 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. విశేషమేమిటంటే బుక్ మై షో తయారు చేసిన సినిమాల జాబితాలో 8 చిత్రాలు దక్షిణ భారతదేశానికి చెందినవే ఉన్నాయి. దక్షిణాది పరిశ్రమ ఎంత ఊపు మీద ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. రణవీర్ సింగ్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా 83 ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి. ఈ ఏడాది చివరి చిత్రం ఇదే కావచ్చు.