వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కేసులు పెట్టించుకునేందుకు తహతహలాడుతున్నారు. అరెస్టులకు భయపడేది లేదని బీరాలు పలుకుతున్నారు. మీదకు ధైర్యంగా మాటలు చెబుతున్నప్పటికీ..లోలోపల వణికిపోతున్నారు. అరెస్టులకు భయపడి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో దమ్ముంటే అరెస్టు చేసుకోండి..నేను నెల్లూరులోనే ఉన్నాను, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిని భయపడను అంటూ సవాల్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఐతే ఆయన వైపు సవాల్ చేస్తుండగానే..మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అత్యంత దారుణమైన మాటలు అన్నారు. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఉపేక్షించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ప్రశాంతి రెడ్డి సైతం కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఐతే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదన్నారు.
ప్రశాంతి రెడ్డిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యంగానే మాట్లాడానన్నారు. ఐతే ఆ మాటలు విన్నవారెవరైనా ప్రసన్నకుమార్ రెడ్డిని సమర్థించరు. ఇక కేసు నమోదు కావడంతో ఆయనలో అరెస్టు భయం మొదలైంది. దీంతో సన్నిహితుల సాయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కోర్టులోనూ ప్రసన్నకుమార్ రెడ్డికి అక్షింతలు పడే అవకాశం ఉంది.











