కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు నిలిపివేసేందుకు సిద్దమని కేంద్ర మంత్రులు, రైతు సంఘాలకు భరోసా ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన 41 రైతు సంఘాల నాయకులు మాత్రం చట్టాల రద్దుకే పట్టుబడుతున్నారు. ఇవాళ మరోసారి రైతులతో చర్చించి కేంద్రానికి తమ నిర్ణయం వెల్లడిస్తామని వారు ప్రకటించారు. అయితే చట్టాల రద్దుకు కేంద్రం అంగీకరించకపోయినా ఒక మెట్టు దిగి చట్టాల అమలును ఒకటిన్నర సంవత్సరం, అవసరం అయితే రెండు సంవత్సరాల వరకు నిలిపివేస్తామని ప్రకటించడంతో చర్చల్లో కొంత పురోగతి కనిపించింది.
శుక్రవారం జరగబోయే చర్చల్లో తేల్చేస్తాం..తోమర్
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపాయి. అయితే ఇంత వరకు ఇరు వర్గాలు ఇక నిర్ణయానికి రాలేదు. మంగళవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నర సంవత్సరం పాటు నిలిపేసేందుకు కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. దీనిపై రైతు సంఘాలు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
రైతు సంఘాల నేతలు చర్చించుకుని కేంద్రానికి తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. చట్టాల రద్దుకే వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండు నెలలుగా రైతులు ఢిల్లీ సమీపంలో రోడ్లపై చలికి, వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకుని రైతు సంఘాలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే శుక్రవారం మరో దఫా కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాలు చర్చించనున్నాయి. ఈ సమావేశంలో దాదాపుగా ఇరువర్గాలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
దిగివచ్చిన కేంద్రం
నూతన చట్టాలను రద్దు చేయడానికి ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఒకటిన్నర సంవత్సరం పాటు నిలిపివేసేందుకు ముందుకు వచ్చింది. అంటే ముందుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న 3 లక్షల మంది రైతులను ఖాళీ చేయిస్తే, తరవాత చర్చలు కొనసాగించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల తరవాత రైతులు మరోసారి భారీ నిరసనకు దిగకపోవచ్చే అంచనాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రైతు సంఘాల నిర్ణయమే ఫైనల్
రైతు సంఘాల నేతలు ఇంకా వారి నిర్ణయం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఒకటిన్నర సంవత్సరాలు, అవసరం అయితే రెండు సంవత్సరాలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినా రైతు సంఘాలు మాత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. కేంద్రం ఓ మెట్టు దిగివచ్చినా రైతు సంఘాలు మాత్రం పట్టు వీడటం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఈ చట్టాల రద్దు సాధ్యం కావనే అనుమానాలు రైతు సంఘాల నేతలను తొలచివేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికి ఉద్యమం నిలిపివేస్తే, తరవాత కేంద్రం చట్టాలను యథాతధంగా అమల్లోకి తీసుకువస్తే మరోసారి ఉద్యమానికి భారీగా రైతులు కదలివస్తారా? లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రైతు సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకుని ఇవాళ కేంద్రానికి తమ నిర్ణయం వెల్లడించనున్నారు.











