ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మాణానికి ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ముందుకు వచ్చింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ సుముఖత వ్యక్తం చేసింది. లాజిస్టిక్స్, గిడ్డంగుల సెక్టార్లో పెట్టుబడులు పెట్టేందుకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది.
ఏపీకి పెట్టుబడులతో పాటు వచ్చే నెలలో విశాఖలో జరగనున్న CII సదస్సుకు పారిశ్రామిక, రాజకీయ వేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబు దుబాయి పర్యటనకు వెళ్లారు. తొలిరోజే పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్విహంచారు. ఇందులో భాగంగానే శోభా గ్రూప్ ఛైర్మన్ రవి మీనన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 100 కోట్ల విరాళంతో అమరావతిలో ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మిస్తామని రవి మీనన్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని, అందులో భాగస్వామ్యం కావాలని రవిమీనన్ను చంద్రబాబు కోరారు. విశాఖ సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని చంద్రబాబు వివరించారు.
తర్వాత షరాఫ్ గ్రూప్ ఛైర్మన్, షరాఫ్ DG సంస్థ వ్యవస్థాపకులు షరాఫుద్దీన్ షరాఫ్తో సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులు నిర్మించాలని షరాఫ్ గ్రూప్ను ఆహ్వానించారు చంద్రబాబు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన షరాఫ్..రైల్వే, పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరారు.
మరోవైపు శుక్రవారం ప్రవాసాంధ్రుల సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఈ సభలో ప్రవాసాంధ్ర బీమా పథకం ప్రారంభించనున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం కింద రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు











