తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన శనివారం సాయంత్రంతో ముగిసింది. కుప్పం మునిసిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సాగింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటుగా రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అవినీతి అక్రమాల పాలనను జనానికి తెలిపేలా చంద్రబాబు ఈ పర్యాటనను సాగించారు. వైసీపీ పాలనలో టీడీపీ ప్రధాన కార్యాలయం, జిల్లాల కార్యాలయాలు, కీలక నాయకులపై దాడులు, స్థానిక సంస్థలు ఎన్నికలో వైసీపీ దౌర్జన్యాలు, నేతలపై అక్రమ కేసులు, రాష్ట్రంలో అంతకంతకూ పెరిగిపోతున్న డ్రగ్స్ దందా, వైసీపీ స్టేట్స్ స్పాన్సర్డ్ ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు.. అవే అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగాలు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.
అడుగడుగునా నీరాజనాలు
పర్యటనలో భాగంగా బెంగుళూరు నుండి రోడ్డు మార్గాన కుప్పం చేరుకున్న చంద్రబాబుకు ఆంధ్ర, కర్నాటక సరిహద్దుల్లో టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తమ నాయకుడు వస్తున్నాడు అని పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. మొదటి రోజు పర్యటనలో చంద్రబాబు వెంట వేలాది అభిమానులు, ప్రజలు అనుసరించగా రోడ్లన్నీ జన ప్రవాహంగా మారాయి. వాడవాడలా పసుపు జెండాల ప్రభంజనమే. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో కదం తొక్కారు. గ్రామగ్రామాన మహిళలు చంద్రబాబుకు హారతులు పట్టారు. మొదటి రోజు జరిగిన సభలో ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారు. నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు.. రెండవ రోజు హిందూ దేవాలయాన్ని దర్శించారు, ముస్లిం పెద్దలతో ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే నియజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.రెండవ రోజు చంద్రబాబు పర్యటనలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుప్పంలో చంద్రబాబును బలహీనపరచాలని వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదని ఈ పర్యటనతో తేలిపోయింది. ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా కుప్పంతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం విడదీయరానిదన్న భావన వ్యక్తమైంది.
దేనికైనా సై అంటున్న తమ్ముళ్లు
చంద్రబాబు తన రెండు రోజుల కుప్పం పర్యటనలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొనగా.. జరిగిన సభలలో చంద్రబాబు తన దూకుడు పెంచారనే చెప్పొచ్చు. తన ప్రసంగాలలో టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న దాడులపై గట్టిగా మాట్లాడారు. జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టారు. వైసీపీ అరాచక చర్యలకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థపై స్వరం పెంచుతూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఇక కార్యకర్తలలో తమ పార్టీ నాయకులపై, పార్టీపై వైసీపీ చేస్తున్న అరాచకాలు, దాడులపైన పోరాటం రూపంలో అయినా, ఎన్నికల రూపంలో అయినా, ఇక ఎలాగైనా పగ తీర్చుకోవలసిందే అనే భావన పార్టీ కార్యకర్తలతో కనిపించింది. ఈ పర్యటన తో టీడీపీ పై వైసీపీ చేస్తున్న అరాచకాలకు సరైన సమాధానం ఇచ్చేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం అయ్యారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలుపే ధ్యేయంగా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారనేది కొట్టొచ్చినట్లు కనపడింది.