తిరుమల వేంకటేశ్వరుడంటే అధికార పార్టీలో ఉన్న వారికి లెక్కలేదా? లేదా ప్రజలకు తమకు 151 సీట్లు కట్టబెట్టి.. తిరుగులేని మెజారిటీ ఇచ్చారు గనుక.. తాము దేవుడికంటె ఎక్కువ అని వారు భావిస్తూ ఉంటారా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. తిరుమలలో డ్రోన్ ల వినియోగంపై స్పష్టమైన ఆంక్షలుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాలినడకన తిరుమలేశుని దర్శనానికి వెళుతూ.. దానిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించుకుంటూ సాగడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
కడప జిల్లాలోంచి తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని అభివృద్ధి చేసి.. బహుళ వినియోగంలోకి తీసుకురావాలనేది.. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న డిమాండ్. అదే డిమాండ్ తో ఆయన 18 ఏళ్లుగా ప్రతి ఏటా తిరుమలకు, తాను ప్రతిపాదిస్తున్న మార్గంలో పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఈ సారి సదరు పాదయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్కు, పాదయాత్రకు పబ్లిసిటీ బాగా చేయించుకోవాలనుకున్న వారి అత్యుత్సాహం.. ఇప్పుడు తాజా వివాదానికి కారణమైంది.
విషయం ఏంటంటే.. వారి పాదయాత్రను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించుకున్నారు. ఏ పోరాటం చేసినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం పబ్లిసిటీకి వాడుకోవడం అనేది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకంటె మించి ప్రతి ఒక్కరూ ప్రయత్ని చేస్తున్నారు. అందుకే.. దేవుడి గుడికి కాలినడకన వెళుతున్నా కూడా.. ఆ నడకను డ్రోన్ కెమెరాలతో రిచ్ గా చిత్రీకరించుకునే ప్రయత్నం.
అయితే ఈ క్రమంలో ఆయన ఒక బేసిక్ విషయాన్ని మరచిపోయారు. తిరుమల పరిసరాల్లో డ్రోన్ లు ఎగరడం అనేది నిషిద్ధం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తిరుమలలో హెలిపాడ్ ఏర్పాటు చేయించాలనే ఆలోచన చేశారు. దానివలన.. వీవీఐపీలు దైవదర్శనార్థం వచ్చే సందర్భాల్లో తిరుపతి ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయని, రేణి గుంట విమానాశ్రయంనుంచి డైరక్టుగా తిరుమలకు హెలికాప్టర్ లో వెళ్లిపోవచ్చునని ఆలోచన చేశారు. కానీ తిరుమల గిరుల మీద హెలికాప్టర్ ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధం అనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆలోచన మానుకున్నారు. తిరుమల గిరులు అనేవి ఎప్పటినుంచో నో ఫ్లై జోన్ గా ఉన్నాయి. ఇన్నింటి నేపథ్యంలో డ్రోన్ ల వినియోగాన్ని కూడా నిషేధించారు.
అయితే మన వాళ్లకు నిబంధనల గురించి పట్టింపు ఏముంటుంది. ఎక్కడ ఏ నిబంధనలు ఉంటాయో.. వాటిని ఉల్లంఘించడం తమ హక్కు అని ఫీలయ్యే నాయకులాయె. అందుకే… తాము చేసే పాదయాత్రను కూడా డ్రోన్ తో చిత్రీకరింపజేసుకుంటూ వారు ఊరేగారు. రెండు వేల మందితో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ అట్టహాసం అంతా తెలియడానికి డ్రోన్ కూడా వాడారు.
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ జరపడంతో టిటిడి విజిలెన్స్ చర్యలు తీసుకుంది. డ్రోన్ కెమెరా ను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు, డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన విజువల్స్ ను కూడా డిలీట్ చేశారు. బాధ్యతగల అధికార పార్టీ నాయకులు అయి ఉండి కూడా నిబంధనలు పట్టించుకోకపోవడం ఏంటని భక్తులు మాత్రం ముక్కున వేలేసుకున్నారు.