వైసీపీ హాయాంలో విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖలో అందినకాడికి దోచేసినట్లుగా బొత్స సత్యనారాయణపై విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆయన మాత్రమే కాక, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సహా ఆయన కింది అధికారులు కలిసి అనేక దందాలకు పాల్పడ్డారని అంటున్నారు. ముఖ్యంగా 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లకు సంబంధించి నిబంధనలను ఎలా ఉల్లంఘించారనే విషయం బయటపడింది. ఏ పని కోసం అయినా ఆర్థిక శాఖ అనుమతి ఉండాల్సి ఉన్నప్పటికీ బొత్స హాయాంలో అవేమీ పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి.
విద్యా కానుకకు సంబంధించి అటు ఆర్థిక శాఖ నుంచే కాక, మంత్రివర్గం, సీఎం పేషీ నుంచి కూడా అనుమతులు ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఆ ప్రతిపాదనను న్యాయ సమీక్షకు కూడా పంపకుండా, టెండర్లు పిలవకుండా రూ.772 కోట్ల కాంట్రాక్టును బొత్స సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాశ్ కలిసి ఫిక్స్ చేశారు. పాత ధరలతో పాత కాంట్రాక్టరుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. తద్వారా కాంట్రాక్టరు నుంచి భారీగా లబ్ధి పొందారని అంటున్నారు. దీనిపై ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపిస్తుందని.. అదే జరిగితే తాను ఇరుక్కుంటానని ముందే గ్రహించి.. ప్రవీణ్ ప్రకాశ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పదవీవిరమణ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా, ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదార్లకు రిపీట్ ఆర్డర్లు ఇచ్చిన వైనం విచారణ జరిపితే తేటతెల్లమయ్యే అవకాశముంది.
విద్యా సంవత్సరం మొదలైనప్పుడే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉన్నా.. మంత్రి బొత్స, అధికారులు పట్టించుకోలేదు. తక్కువ సమయంలో కొనుగోలు చేయాల్సి వస్తే షార్ట్ టెండర్ పిలుస్తారు. దీన్ని కూడా పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన ఫైలును అప్పటి ఆర్థిక శాఖ తిప్పి కొట్టింది. దాన్ని బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ పట్టించుకోలేదు. కేబినెట్లో దీన్ని టేబుల్ ఐటమ్గా తీసుకొచ్చేందుకు ట్రై చేయగా.. అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వద్దని వారించారు. సీఎం కార్యాలయం అనుమతి కోసం పంపగా, అక్కడా అనుమతి రాలేదు. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ ఇద్దరూ వారి స్థాయిలో ఫైలును ఆమోదించేశారు. జనవరి 10న జీవో ఎంఎస్-2 జారీ చేశారు. టెక్ట్స్ బుక్లు, వర్క్ బుక్లు తప్ప, మిగతా రూ.772 కోట్ల విలువ చేసే సామగ్రిని పాత కాంట్రాక్టర్ కే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు.
మరోవైపు, రూ.100 కోట్లకు పైబడి చేపట్టే పనులను ముందుగానే న్యాయసమీక్షకు పంపాలని అప్పటి ప్రభుత్వం ముందే ఓ నిర్ణయం తీసుకుంది. కానీ, రూ.772 కోట్లతో విద్యా కానుకలు కొనుగోలు చేస్తున్నా, న్యాయ సమీక్ష చేయించలేదు. ఇలా కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా విద్యా కానుక రిపీట్ ఆర్డర్ ఇవ్వడాన్ని ఓ ఐఏఎస్ కూడా తప్పుపట్టారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న దీమాతో మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ ఈ అక్రమానికి పాల్పడినట్లు తెలిసింది. దీనిపై విచారణ జరిపించాలని కొందరు ఇప్పటికే మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి త్వరలో సీఐడీతో విచారణ చేయిస్తుందని అంటున్నారు.