తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామాలపై స్పందించిన ఆయన, నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న డివిజన్లలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులుంటే వారి తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. 23వ డివిజన్లో జనసేన-బీజేపీ అభ్యర్థులుంటే ప్రచారంటో పాల్గొంటానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. పార్టీని అమ్ముకున్నవారికి భవిష్యత్ ఉండదు.. పార్టీని నమ్ముకున్నవారికి తాను అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. తాజాగా చింతమనేని చేసిన వ్యాఖ్యలతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కసారిగా హీటు పెరిగిపోయింది. కాగా, మున్సిపల్ ఎన్నికల తరుణంలో.. పాలక పక్షం వైసీపీకి చెందిన నేతలతో.. ప్రతిపక్షాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పుతున్న సంగతి తెలిసిందే.
Also Read : చింతమనేని ప్రభాకర్ అరెస్ట్.. ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి