దేశంలో కరోనా మృత్యుగంటలు మోగుతూనే ఉన్నాయి.నిన్న ఒక్క రోజే దేశంలో 3.41 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.అయితే గత వారంతో పోల్చుకుంటే కరోనా వేగం తగ్గిందనే చెప్పవచ్చు.దేశంలో 16 రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించడమే ఇందుకు కారణం. మరికొన్ని రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.దీంతో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయి.కరోనా వేగం తగ్గినా,మరణాలు మాత్రం భయపెడుతున్నాయి.నిన్న ఒక్క రోజే దేశంలో అధికారికంగా 4వేలకుపైగా కరోనా రోగులు చనిపోయారు.అంటే కరోనా వ్యాప్తి వేగం తగ్గినా మరణాలు మాత్రం తగ్గకపోవడం ఆందోళక కలిగిస్తోంది.ఇప్పటికే మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఢిల్లీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అవమలవుతోంది.దేశంలో 80 శాతం జనాభా లాక్ డౌన్ పరిధిలోకి వచ్చారు. దీంతో కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది.నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి కరోనా రోజు వారీ కేసుల సంఖ్యకు లక్షకు తగ్గవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేసింది.
ఆక్సిజన్ కొరత అదిగమించినట్టేనా..
దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచారు.చాలా కంపెనీలు పారిశ్రామిక అవసరాలు తగ్గించుకుని,లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి సారించాయి.మూతపడ్డ ఆక్సిజన్ ప్లాంట్లు తెరిపించారు.దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.అయితే ఆక్సిజన్ రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.దేశీయ అవసరాలకు రోజుకు 20 వేల టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది.ఈ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.దేశంలోని అనేక పరిశ్రమలు తమ అవసరాలు తగ్గించుకుని మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.మారుతి సుజుకీ కార్ల తయారీ నిలిపి వేసి పెద్ద ఎత్తున ఆక్సిజన్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తోంది.ఇక ఉక్కు పరిశ్రమలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.దీంతో ఆక్సిజన్ కొరత కొంత వరకు తీరిందనే చెప్పవచ్చు.ఇక వాయు,నౌకా దళాలు కూడా ఆక్సిజన్ తరలించే కార్యక్రమంలో చరుగ్గా పాల్గొంటున్నాయి.దీంతో సుదూర ప్రాంతాలకు విమానాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్నాయి.ఆక్సిజన్ సరఫరా, నిల్వ సామర్ద్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.నిల్వ సామర్థ్యం 40 వేల టన్నులకు పెంచుకుంటే ఇక ఆక్సిజన్ కొరతను అదిగమించినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సెకండ్ వేవ్ తగ్గుతోందా..?
దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.కొత్తగా రోజుకు 3.4 లక్షల మందికి కరోనా సోకుతుంటే, రోజుకు 4 లక్షల మంది కరోనా తగ్గి ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళుతున్నారని కేంద్రం ప్రకటించింది. నేటికి దేశంలో 2 కోట్ల మంది కరోనా బారి నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నేటికీ దేశంలో 38 లక్షల మంది కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.రాబోయే రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు తగ్గవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. నెలాఖరు నాటికి దేశంలో 16 లక్షల యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడతామనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. అయితే మూడో వేవ్ మాత్రం పొంచి ఉంది.అది ఎప్పుడనేది ఇప్పుడే స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.అమెరికాలో ఇప్పటికే మూడో వేవ్ మొదలైంది.అంటే మన దేశంలో మరో 5 నెలల తరవాత మూడో వేవ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. మూడో వేవ్ నుంచి బయటపడేందుకు కేంద్ర ఇప్పటి నుంచే అన్ని విధాలా సిద్దం అవుతోంది.
వ్యాక్సిన్ ఎక్కడిదాకా వచ్చింది
నేటితో దేశంలో 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు.రోజుకు సగటున 60 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆగష్టు నాటికి దేశీయంగా 20 కోట్ల వ్యాక్సిన్లు,ఫిబ్రవరి నాటికి 200 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం అనేక కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది.ఇక విదేశాల నుంచి కూడా నేరుగా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటోంది.ఇప్పటికే రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండో విడత దిగుమతి చేసుకున్నారు. రాబోయే 2 మాసాల్లో దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచి రాబోయే ఆరు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని ఉధృతి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.ఏపీలో నిన్న ఒక్క రోజే 22 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి.ఇప్పటికే ఏపీలో 2 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసీవర్ మందులు దొరక్క రోగులు, వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం బెడ్ల సంఖ్యను పెంచినా కరోనా రోగులకు చాలడం లేదు.చాలా ఆసుపత్రుల్లో నిరంతరం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో కరోనాకు చికిత్స అందించడం సవాలుగా మారింది.ఇక తెలంగాణలో నిన్న ఒక్క రోజే 8 వేల కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 67వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ వేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇటీవల జరిపిన ఇంటింటి సర్వేలో లక్షన్నర మంది కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారని తేలింది.వారందరికీ మెడికల్ కిట్లు అందిస్తున్నారు.రాబోయే 20 రోజుల్లో లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే అందరికీ వ్యాక్సిన్ మాత్రం ఫిబ్రవరి నాటికే సాకారం కానుంది.