సురేష్ రైనా ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణమంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. కరోనా కారణం కాదు ఇంట్లో జరిగిన విషాదమే కారణమంటూ కొన్ని కథనాలు వినబడ్డాయి. మేనత్త భర్త హత్యకు గురి కావడంతో ఆయన దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ప్రచారం జరిగింది. పంజాబ్, పఠాన్ కోట్ పోలీసులు కూడా రైనా మామయ్య హత్యకు గురైనట్లు చెప్పడంతో అందరూ ఇదే విషయాన్ని నిజమని నమ్మారు. కానీ రైనా సీజన్ నుంచి తప్పుకోవడానికి కారణం వేరే ఉందని ఓ షాకింగ్ విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోటల్ రూం విషయంలో విభేదాలు రావడంతో రైనా మనస్థాపం చెందాడని తెలుస్తోంది. అతను మామ హత్య నెపంతో ఇండియాకు వచ్చేసినట్లు క్రీడా వర్గాలలో చర్చ జరుగుతోంది.
దుబాయ్ లో తనకు కేటాయించిన రూము విషయంలో రైనా తీవ్ర అసంతృప్తితో జట్టు యాజమాన్యంతో వాదులాడాడని తెలుస్తోంది. తన రూములో బాల్కనీ లేదని ధోనికి కేటాయించిన రూము లాంటిదే రైనా డిమాండ్ చేశాడని సమాచారం. ఎంత చెప్పిన వినకపోగా గొడవకు దిగాడని వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయంలో ధోని కూడా జోక్యం చేసుకొని రైనాపై ఫైర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా భారిన పడ్డారు. ముందు జాగ్రత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్ లో ఉంది. ఎక్కువ రోజులు క్వారంటైన్ లో ఉండే విషయంలో కూడా రైనా జట్టు యాజమాన్యంపై అసంతృప్తిని తెలియచేశాడని తెలుస్తోంది. కరోనా తీవ్రతతో తనకు ఏమైనా అయితే తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పిల్లల కంటే మరేదీ తనకు ముఖ్యం కాదని రైనా సహచర ఆటగాళ్లతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
కారణాలేవైనా గాని రైనా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. రైనా తప్పుకోవడానికి సరైన కారణాలేంటి? అంటూ చర్చ జరుగుతున్న సమయంలో సీఎస్కే జట్టు యజమాని శ్రీనివాసన్ చేసిన కామెంట్స్ వేడిని రాజేసింది. సీఎస్కే ఓ కుటుంబమని చెప్పిన శ్రీనివాసన్ సీనియర్ ఆటగాళ్లు సర్దుకుపోవాలని హితవు పలికారు. జూనియర్ ఆటగాళ్లకు ఆదర్శప్రాయంగా ఉండవలసిన ఆటగాళ్లు సర్దుకుపోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. మొండిగా వ్యవహరించే ఆటగాళ్లు తమకు అవసరం లేదని తెలిపిన ఆయన నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. విజయగర్వం తలకెక్కిన వారు మొండిగా వ్యవహరిస్తే చేసేదేమి లేదని స్పష్టం చేశారు. శ్రీనివాసన్ ఎవరి పేరు చెప్పకపోయినా రైనాను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసినట్లు అర్ధమవుతోంది.