ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా? ఇంకెవరు?.. వైఎస్సార్ కు నమ్మినబంటుగా, ఆయనకు ఓ కుటుంబ సభ్యుడి కంటే కూడా ఎక్కువన్నట్లుగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరే. దానం నాగేందర్ నోట నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయంటే.. నిజంగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. తాను ఎంతగా తడబడినా.. ఎన్నిసార్లు పార్టీలు మారినా.. అక్కున చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన వైఎస్సార్ పై దానం నాగేందర్ ఇలా వ్యాఖ్యలు చేశారంటే నిజంగానే అనుమానం వస్తుంది కదా. అయితే ఈ వ్యాఖ్యలు స్వయంగా దానం నాగేందర్ చేసినవే. ఇందులో ఎలాంటి సందేహపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే.. వైఎస్సార్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన దానం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హస్తం పార్టీకి హ్యాండిచ్చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు కదా.
కాంగ్రెస్ పైనా విసుర్లు
రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానంకు వైరి వర్గమే. అందులోనూ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీ పీసీసీ చీఫ్ అయ్యారు. రేవంత్ అంటేనే.. అంతెత్తున ఎగిరపడే దానం.. ఇప్పుడు రేవంతుడికి ఏకంగా కీలక పదవి దక్కితే.. కాంగ్రెస్ పార్టీపై ఎందుకు విరుచుకుపడరు? ఈ క్రమంలోనే ఇటు రేవంత్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన దానం.. పనిలో పనిగా వైఎస్సార్ ప్రస్తావనా తెచ్చి.. తన పార్టీ అధినేత కేసీఆర్ కంటే వైఎస్సార్ గొప్పోడేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ ఈ దిశగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
రేవంత్ కు దుమ్ము లేచేది..
శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే.. *కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ఆ పార్టీలో ఏముంది? ప్రాణం ఉన్నంతవరకూ టీఆర్ఎస్ లోనే ఉంటా. కేసీఆర్ వెంటే సాగుతా. రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి వీహెచ్ ఆసుపత్రిలో ఉన్నారు గానీ.. లేదంటే ఇప్పటికే రేవంత్ కు దుమ్ము లేచిపోయేది. కాంగ్రెస్ పార్టీ నేతలకు చీము, నెత్తురు ఉంటే.. ఆ పార్టీలో నుంచి బయటకు రావాలి. అభివృద్దిలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. వైఎస్సార్ కంటే కేసీఆరే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు* అని దానం ఏమాత్రం తడబాటు లేకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు.











