CID మాజీ చీఫ్ PV సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ ఓ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన సునీల్ కుమార్..ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీశాయి.
సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆలిండియా సర్వీస్ నిబంధనలు అతిక్రమించిన సునీల్ కుమార్పై వెంటనే చర్య తీసుకోవాలని DOPTకి లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ACB కేసు.. అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో ఆయన సస్పెండ్ అయిన విషయాలను లేఖలో ప్రస్తావించారు RRR. అఖిల భారత సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ వర్తిస్తాయని, సునీల్ కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్రానికి రఘురామ విజ్ఞప్తి చేశారు.
సునీల్ కుమార్ గతంలో ఏపీ పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో CID ADGగా ఉన్న టైంలో ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. వైసీపీ మూకలు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా, వారి ఆచూకీ లభించలేదని కోర్టుకు CID సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మొత్తం 18 మందిపై చర్యలు తీసుకుంది. విదేశాల్లో ఉన్న వారిని సైతం అరెస్టు చేసింది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిని అర్ధరాత్రి అరెస్టులు చేయించి చితకబాదించినట్లు సునీల్ కుమార్ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం, కస్టోడియల్ హింసకు గురిచేయడంతో సునీల్ కుమార్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేయడంతో సునీల్పై కేసు నమోదైంది. ఈ నెల 4న పోలీసుల ముందు విచారణకు సునీల్ హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సునీల్ కామెంట్స్ వెనక జగన్ మాస్టర్ మైండ్ ఉందని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు.. కూటమి నేతలు కలిసి ఉంటే వారిని ఓడించడం కష్టం అని ఇప్పటికే అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ సహా పలువురు నేతలు బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు.. అందుకే, టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టాలనేది వైసీపీ ప్లాన్గా భావిస్తున్నారు.. దీనికోసమే, సునీల్తో ఒక చర్చని లేవ దీశారని అనుమానిస్తున్నారు.











