శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారా? , ఆ పార్టీ వ్యవహారాలపై కినుక వహిస్తున్నారా , తన ఆవేదన బయటకు చెప్పుకోలేక , లోపల ఉంచుకోలేక సతమతమవుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.
దానికి కారణమేంటో పరిశీలిద్దామా ..
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో మంచి వాక్పటిమ, స్పురద్రూపం కలిగి, నిక్కచ్చి రాజకీయాలకు నిలువుటద్దంగా నిలుస్తూ , కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైసీపీ హయాంలో ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక గోళ్లు గిల్లు కుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటూ తనని ఆశ్రయించిన వారికి అండగా ఉండేవారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ, జిల్లా నాయకులకు, శ్రేణులకు అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశం చేసేవారు. అవసరమైన వేళ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు. ఇదంతా గతం.
ప్రస్తుతం ఆయన ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడటం లేదని, పార్టీ శ్రేణులనూ దూరం పెడుతున్నారని, ప్రజలను ఆయన బంగ్లాలోకి రానివ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనంతటీకీ ‘కరోనా’ కారణమని బయటకు చెబుతున్నప్పటికీ, లోలోన ప్రభుత్వం తీరుపై ఆయన నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితుల వద్ద ‘ఈ ప్రభుత్వ హయాంలో మనం చెప్పిందేమీ జరగదని, మనకూ ప్రాధాన్యం లభించడంలేదని’ వాపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే మౌనంగా ఉండటమే మంచిదని భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.
మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లడమే కారణమా ..
సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శ్రీకాకుళంలో సీనియర్ అయిన ధర్మాన మంత్రి పదవి ఆశించారు. ఆయన అన్నయ్య కృష్ణదాస్ను మంత్రి పదవి వరించడంతో ధర్మాన భవిష్యత్ పై ఆశతో ముందడుగు వేశారు. ఇటీవల ఈ జిల్లా నుండే పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మంత్రిగా నియమించడం, కృష్ణదాస్కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించడంతో ధర్మానకు భవిష్యత్ ఆశలు కూడా నీరుగారిపోయాయి. ఈ ప్రభుత్వ హయాంలో తనకు మంత్రి యోగం లేనట్టేననిపించడంతో- తన బంగళా తలుపులు మూసుకున్నట్టు తెలుస్తోంది.
ఆశలు రేకెత్తిస్తోన్న వైసీపీ
ధర్మానలో నెలకొన్న నైరాశ్యం పసిగట్టిన వైసీపీ అధిష్టానం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన విజయనగరం (ఉత్తరాంధ్ర) ప్రాంతీయాభివృద్ది మండలి ఛైర్మన్గా నియమిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవి ఇవ్వడం ద్వారా ధర్మానను గౌరవించినట్లు ఉంటుందని అనుకున్నారు. ఆయనలో నెలకొన్న నైరాశ్యం తొలగిపోతుందని ఈ ప్రణాళిక రూపొందించింది.
ససేమిరా అంటున్న ‘బొత్స’
విజయనగరం కేంద్రం గా రూపొందనున్న ప్రాంతీయమండలి ఛైర్మన్గా పక్క జిల్లా వ్యక్తిని నియమించడమేంటని, ఒకే ఇంటికి రెండు కీలకపదవులు ఎలా ముట్టజెప్పుతారని వైసీపీ సీనియర్ నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఆశావహులు అధికంగా ఉండటం, ఆ ఛైర్మన్గిరీ విజయనగరానికే దక్కాలని బొత్స పట్టుబడుతుండటం, ఆయన ప్రశ్నలో వాస్తవం ఉండటంతో ‘ధర్మాన’ ఆశలు అడియాసలు అవుతున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు ఎప్పటికి ఎలావుంటాయో తల పండిన రాజకీయ నాయకులు కూడా ఇదమిత్థంగా విశ్లేషించలేకపోతున్నారు. ప్రస్తుత తరుణంలో భవిష్యత్ రాజకీయాలు ఎలావుంటాయో, ఎంతోకాలం జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువుగా చక్రం తిప్పిన ధర్మాన ప్రసాదరావు మళ్లీ యాక్టివ్ అవుతారో లేదో వేచిచూడాల్సిందే.











