రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బహిరంగ సభలో బండబూతులతో తిట్టడమే కాకుండా అవాక్కైన మీడియానుద్దేశించి ‘రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్’ అంటూ డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణదాస్ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
బహిరంగసభలో..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో కృష్ణదాస్ నోరు జారారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. బహిరంగ సభలో మైకు పట్టుకుని పచ్చి బూతులు మాట్లాడేశారు. అదేసమయంలో జర్నలిస్టులు షాక్ తినేసరికి, వారిని ఉద్దేశించి మరీ విడ్డూరంగా ‘రాసుకోండి.. మరేం పర్లేదు’ అంటూ ఉచితసలహా కూడా ఇచ్చారు.
రెచ్చిపోయిన ధర్మాన
అమరావతి ఉద్యమంపై విమర్శలు చేస్తూ ధర్మాన కృష్టదాస్ రెచ్చిపోయారు. ‘రైతులను రెచ్చగొట్టి, అమరావతి ఉద్యమం నడపడానికి పెయిడ్ వర్కర్స్ను పెడుతున్నారు. మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్ వేసుకునే రైతులకు అన్యాయం చేస్తున్నారంటాడు ‘—-కొడుకు’ అని చంద్రబాబును ఉద్దేశించి బూతు పురాణం ప్రారంభించారు.
ఆ సమావేశంలోనేవున్న మీడియా ప్రతినిధులు గుర్తించినప్పటికీ సరిదిద్దుకోలేదు. ‘రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్’ అనడంతో సభికులతో పాటు మీడియా ప్రతినిధులూ ఆశ్చర్యచకితులయ్యారు.
దుమారం రేపుతున్న కృష్ణదాస్ వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, రాష్ట్రంలో సీనియర్ రాజకీయనేతను ఉద్దేశించి బండబూతులు తిట్టడం సరికాదంటున్నారు. వెంటనే ధర్మాన క్షమాపణలు చెప్పాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.