తాజా చిత్రాల కలెక్షన్స్ వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోల క్రేజ్ పెంచడానికే మూవీ కలెక్షన్ల అంకెలు పెంచి చూపిస్తున్నారన్న ఆరోపణల పై ఆయన మాట్లాడుతూ సినిమాల కలెక్షన్లకు సంబంధించి నిర్మాతలు, చిత్ర యూనిట్ చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలు ఆగిపోయాయని, దానివల్ల మూవీ బడ్జెట్ లు అనుకోని విధంగా పెరిగిపోయాయని ఆయన తెలిపారు. దీంతో ప్రొడ్యూసర్ ఎంత డిమాండ్ చేస్తే అంతకు తలోగగాల్సిన పరిస్థితిలు డిస్ట్రిబ్యూటర్ లలో నెలకొన్నాయని, అసలు తన దృష్టిలో నిర్మాతల డిమాండ్ లకు తలొగ్గడం డిస్ట్రిబ్యూటర్ ల తప్పనేది తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ లు నిర్మాతల డిమాండ్ లను ఒప్పుకోకపోతే టికెట్ రేట్లు పెరిగే పరిస్థితి లేదని, అప్పుడు బిజినెస్ ఎక్కువ మొత్తానికి జరగదు కాబట్టే ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని, రాజమౌళి, రాంచరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన RRR చిత్రంతో టికెట్ రేట్లు పెంచడం అనేది మొదలయ్యిందని, దానినే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఒక హీరో సినిమా ఎంత కలెక్షన్ లు రాబడుతోందో అదే మొత్తాన్ని మరో సినిమాకి కోట చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కువ రాబట్టాలని కోరుకుంటారు. అయితే దానికి ఒప్పుకోవడమా లేదా అనేది డిస్ట్రిబ్యూటర్ ల పైనే ఆధారపడి ఉంటుంది. అదేసమయంలో ఒక సినిమా హిట్ అయితే కలెక్షన్స్ ఏ మేరకు ఉంటాయి, ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, అప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది బేరీజు చేసుకోవాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్ ల పైనే ఉంటుంది. అవన్నీ ఆలోచించకుండా నిర్మాతలు చెప్పిన దానికి తలాడించడం వల్లనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ నేపధ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ ల దే అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని దిల్ రాజు అన్నారు.
ఇక తొలిరోజు కలెక్షన్స్ వేరియం గురించి ఆయన ప్రస్తావించారు. తొలిరోజు కలెక్షన్స్ రకరకాలుగా ఉంటాయని, ఓ సినిమాకు, మరో సినిమాకు ఎప్పుడూ మారుతూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నైజాంలో మొత్తం 450 థియేటర్ లు ఉంటే వాటిలో పెద్ద హీరో సినిమాలు 300 నుంచి 350 సెంటర్లలో రిలీజ్ అవుతుంటాయని అన్నారు. ఉదాహరణకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా RRR నైజాంలోని అన్నీ థియేటర్ లలో రిలీజ్ అయ్యింది, అదే కేజీఎఫ్ 250 థియేటర్ లకు పైగా మాత్రమే విడుదల అయ్యింది. అప్పుడు కలెక్షన్స్ అంకె అనేది మారి కనిపించడం సహజమని ఆయన తెలిపారు.
అదేసమయంలో సినిమాలకు సంబంధించి కలెక్షన్ ల అంకెలు తప్పుగా చెప్పడం అనేది త్వరలోనే ఆగిపోతాయని దిల్ రాజు పేర్కొన్నారు.ఇప్పటికే అమెరికాలో రన్ ట్రాక్ ఉందని, బాలీవుడ్ లో నికర వసూళ్లను వెల్లడిస్తున్నారని, అయితే టాలీవుడ్ లో మాత్రం తొలిరోజు కలెక్షన్స్ లో హైర్స్ , షేర్ గ్యారెంటీలను రెండూ కలిపి చూపిస్తున్నారని.. హైర్స్ కలిపి చెప్తే అది అసలు షేర్ లోకి రాదని వెల్లడించారు. ఈ క్రమంలో పెద్ద హీరోల సినిమాలకు వెల్లడించే కలెక్షన్స్ సరైనవి కావని, త్వరలోనే ఈ పరిస్థితులు మారుతాయని ఆయన స్పష్టం చేశారు.