మన హీరోలు అందంగానే ఉండాలి. ఎలాంటి అవకరాలు ఉండకూడదు. ముందు నుంచీ మన దర్శకులు మన కథానాయకులకు అలాగే ప్రోగ్రామింగ్ చేశారు. మన స్టార్ హీరోలు కూడా ఎప్పుడూ అలాంటి పాత్రల జోలికి పోలేదు. ఒక వేళ ఎవరైనా ఆ ప్రయోగం చేసినా… ఫలితంగా దారుణంగా ఉంటుంది. అప్పట్లో యన్టీఆర్ ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సినిమాలో అవిటివాడి పాత్ర పోషించి.. కథా బలం వల్ల సక్సెస్ అందుకున్నారు. అయితే ఆయన అంధుడిగా నటించిన ‘చిరంజీవులు’ సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు. యన్టీఆర్ లాంటి అందగాడు గుడ్డివాడిగా కనిపించడాన్ని ఎవరూ ఇష్టపడలేదు.
ఆ తర్వాత మళ్లీ ఎవరూ టాలీవుడ్ లో దివ్యాంగులు గా నటించిన దాఖలాలు లేవు. అయితే కమల్ హాసన్ మాత్రం దీనికి మినహాయింపు. ఎందుకంటే..ఆయనకి ఇమేజ్ తో సంబంధం ఉండదు. ఆయన ఏ పాత్ర పోషించినా దానికి మంచి వెయిట్ వస్తుంది. ‘అమావాస్య చంద్రుడు’ సినిమా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక హీరోయిన్స్ కూడా గతంలో ఇలాంటి పాత్రలు పోషించి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. జయసుధ, సుహాసిని, జయప్రద, శ్రీదేవిలాంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలు పోషించి సత్తా చాటుకున్నారు.
ఇప్పుడు జెనరేషన్ మారింది. ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారుతూ వస్తోంది. ఇప్పుడు సరికొత్త పాత్రలతో, మంచి కథలతో ఎలాంటి హీరో నటించినా.. చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రవితేజ అంధుడిగా నటించిన ‘రాజా ది గ్రేట్’ ఏ రేంజ్ హిట్టందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. కొందరు టాలీవుడ్ నటీనటులు దివ్యాంగులు గా నటించడానికి సిద్ధమవుతున్నారు.
యంగ్ హీరో శర్వానంద్ .. జాను తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. శర్వా.. వరుసగా మంచి కథాంశాల్ని ఎంపికచేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాలో వ్యవసాయదారుడిగా నటిస్తున్నాడు. ఆ తర్వాత ఆర్.యస్. 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే మూవీని లైన్ లో పెట్టుకున్నాడు. అలాగే.. రాజుసుందరం దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అవుతున్నాడు. కాగా.. ప్రకాశ్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నాడు . అందులో శర్వానంద్ దివ్యాంగుడి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
భీష్మ తో ఎర్లియర్ గా సూపర్ హిట్టందుకున్న నితిన్ .. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అంధాధున్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇందులో నితిన్ గుడ్డివాడిగా కనిపించబోతున్నాడు. అందులో హీరో నిజంగా గుడ్డివాడు కాకపోయినా.. క్లైమాక్స్ లో అతడు నిజంగానే అంధుడు అయిపోతాడు. బాలీవుడ్ లోటబు చేసిన పాత్రను తెలుగులో శ్రియా శరణ్ చేయబోతోంది.
ప్రస్తుతం అందాల అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దాన్ని ఓటీటీలో త్వరలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క పుట్టు మూగ, బధిర పాత్రల్ని పోషిస్తోంది. ఈ డిజెబిలిటీతో ఉన్న ఆమె ఇందులో ఒక అద్భుతమైన చిత్రకారిణి కూడా.
ఒక మర్డర్ ను కళ్ళారా చూడడం వల్ల ఆమె సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇక .. అక్కినేనివారి కోడలు సమంత సైతం మూగ, బధిర పాత్రలతో ఒక బైలింగ్విల్ మూవీ చేయబోతోంది. అశ్విన్ శరవణ్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి దివ్యాంగులుగా నటిస్తున్న వీరంతా ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.











