ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సోమేశ్వరరావు అనే వ్యక్తి తాను తమ్మినేని పిఏ ని అని చెప్పుకుంటూ నకిలీ గుర్తింపు కార్డుతో పలువురిని మోసం చేసినట్లు పలు పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయనను ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ వేలుపెట్టి చూపే స్థాయిలో లేకున్నా సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఆయనకు ఎదురుకావడం వైచిత్రి. ఇప్పటి వరకూ ఆయనను ఎవరూ ఈ విషయంపై ప్రశ్నించకపోయినా తమ్మినేని తమ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఓ ప్రకటనను విడుదల చేయించారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి స్పీకర్ పీఏ నంటూ పలువురిని మోసం చేసినట్లు మా దృష్టికి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమేశ్వరావు అనే వ్యక్తికి స్పీకర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఎలాంటి గుర్తింపు కార్డును ఇవ్వలేదని కార్యదర్శి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
సోమేశ్వరరావుకు అసెంబ్లీ కార్యాలయంకు ఎలాంటి సంబంధం లేదని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. సోమేశ్వరరావు అనే పేరు గల వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లోనికి వెళ్లి అధికారులను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తమ్మినేని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇతని ప్రలోభాలకు, మోసాలకు ఎవ్వరూ గురికావద్దని స్పీకర్ తమ్మానేని సీతారాం హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా తమ్మినేని పేరిట జరుగుతున్న మోసాలు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లాయనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా తమ్మినేనిపై ఇదే విషయంలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమ్మినేనికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన తమ్మినేని 2004 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆయన 2009లో తిరిగి పోటీ చేశారు. కానీ ఆయన రెండో స్థానానికే పరిమితమయ్యారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన తన అల్లుడు సమీప టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని నిర్వేదంలో తమ్మినేని మునిగిపోయారు. 2019 ఎన్నికలలో జగన్ వేవ్ తో ఆయన దాదాపు 15 సంవత్సరాల తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తోందని ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయనను స్పీకర్ గా ఎంపిక చేశారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయిన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో తమ్మినేని మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఈ సారి కూడా ఆయనకు అవకాశమివ్వలేదు.
తమ్మినేనికి షాక్ ఇస్తూ జగన్ తన మంత్రి వర్గంలోకి సీదరి అప్పలరాజు, సీఎస్ వేణుగోపాలకృష్ణలను తీసుకున్నారు. దీంతో గత కొద్దీ రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవలే మీడియా సమావేశంలో విమర్శించారు. మంత్రి పదవి రాలేదని తమ్మినేని సైలెంట్ గా ఉన్నారు తప్పా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కానీ ఈ మధ్య కాలంలో తన పేరిట జరుగుతున్న మోసాలతో తమ్మినేని మౌనం వీడి ఓ ప్రకటన చేయవలసి వచ్చిందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.