బాలీవుడ్ లో బాహుబలి రేంజ్ లో తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఇందులో రణ్ భీర్ కపూర్ హీరోగా నటిస్తుంటే.. అమితాబ్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం అయితే.. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి బాగా తెలియడంతో మన హీరోలతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజతో పాటు తదితరులు బీటౌన్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇక సీనియర్ హీరో నాగార్జున కూడా చాలా గ్యాప్ తరువాత మరోసారి బ్రహ్మాస్త్ర మూవీతో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే బ్రహ్మాస్త్ర మూవీ టాలీవుడ్ యంగ్ హీరోకు ఆఫర్ రాగా, ఆయన తిరస్కరించారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరనుకుంటున్నారా..? టాలీవుడ్ లో తనదైన శైలిలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న సుధీర్ బాబు.
2016లో వచ్చిన బాఘీ చిత్రంలో విలన్గా నటించి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలో తన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చినా, సుధీర్ మళ్లీ బాలీవుడ్ సినిమాలో కనిపించలేదు. అయితే.. తాజాగా సుధీర్ ఈ విషయం పై స్పందిస్తూ త్వరలో విడుదల కానున్న బిగ్ మూవీ బ్రహ్మాస్త్రలో నటించే అవకాశం వచ్చిందని, అయితే దానిని తాను తిరస్కరించానని వెల్లడించాడు. కారణం ఏంటంటే.. బ్రహ్మాస్త్ర నిర్మాతలు తనకు ఈ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశారన్నారు. కానీ అదే సమయంలో సమ్మోహనం రూపంలో మరో ఆఫర్ రావడంతో దాన్ని తిరస్కరించానని చెప్పారు. అదీ.. సంగతి.











