(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయవాడలో రూ.441 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడినట్టే.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో, కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారం పాటు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలనుకున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాయిదా వేసుకున్నారు.
విజయవాడ వాసుల రెండు దశాబ్దాల కల, ఎన్నో పోరాటాల ఫలితంగా సాకారం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ ఈ నెల 4న అందుబాటులోకి రావాల్సి ఉంది. నిర్మాణంలోనే అనేక అవాంతరాలు ఎదుర్కొని 18 నెలల్లో పూర్తి కావాల్సిన ఫ్లైఓవర్ ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత పూర్తయింది.
నాలుగు రోజుల్లో దుర్గగుడి పైవంతెన ప్రారంభం అవుతుందనగా ప్రణబ్ రూపంలో మరో అవాంతరం వచ్చి పడింది. రూ.441 కోట్లతో 2.6 కి.మీ. మేర నిర్మించిన ఫ్లైఓవర్ తో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. అనేక అవాంతరాలు దాటుకుని ఈ ఫ్లైఓవర్ ప్రారంబానికి సిద్దమైంది. రెండు దశాబ్దాలు వేచి చూసిన విజయవాడ వాసులు దుర్గగుడి పైవంతెన అందుబాటులోకి వచ్చేందుకు మరో పదిరోజులు ఆగక తప్పేలా లేదు.
రెండు దశాబ్దాల పోరాటం ఎందుకంటే?
దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించే ప్రాంతం భౌగోళికంగా చాలా సమస్యాత్మక ప్రాంతం. జాతీయ రహదారి 65పై ( పాత నెంబరు 9) పై హైదాబాద్ నుంచి విజయవాడ నగరంలో ప్రవేశించే ప్రాంతంలో ఒకవైపు భారీ కొండ, మరో వైపు కృష్ణా నది మధ్యలో కేవలం 80 అడుగుల వెడల్పుతో మాత్రమే దారి ఉంది. కొండను తవ్వి దారి వెడల్పు చేయాలంటే కొండపై దుర్గమ్మ ఆలయం. కొండను ఏ మాత్రం ముట్టుకున్నా భక్తుల సెంటిమెంట్ దెబ్బతింటుంది.
మరో వైపు నదిలో భారీ ఫైఓవర్ పోల్సు వేయడం ప్రమాదకరమని, ఇక్కడ అసలు పైవంతెన నిర్మాణం కుదరదని యూపీఏ ప్రభుత్వంలో అనేక సార్లు సర్వేలు చేసి వదిలేశారు. 2014లో కేంద్రంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం , ఆనాడు ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చాక దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం- మరోసారి తెరమీదకు వచ్చింది. దేశంలో భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాంలో ఫ్లైవర్లు నిర్మించిన ఇంజనీర్లతో సర్వే చేయించారు.
వారి సూచన మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం రూ.123 కోట్లు చెల్లించి, కొంత ప్రయివేటు భూమి సేకరించింది. దీంతో పైవంతెన నిర్మాణం ప్రారంభం అయింది. 18 నెలల్లో పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన సోమా కంపెనీ ఆపసోపాలుపడి 6 సంవత్సరాలకు ఎట్ట కేలకు దుర్గగుడి పైవంతెన పూర్తి చేసింది. మరి కొద్ది రోజుల్లో దుర్గమ్మ ఫైఓవర్ అందుబాటులోకి రానుంది. బెజవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
https://youtu.be/S3BGB9ktOlI










