ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారిన వివాదంలో ఉద్యోగ సంఘాలు చేరాయి. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే,ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం ప్రభుత్వం, ఎన్నికల సంఘం, హైకోర్టు పరిధిలో ఉంది. ఈ లోగానే ఉద్యోగ సంఘాల నేతలు పనిగట్టుకుని మరీ ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచాయి. ఎన్నికల సంఘానికే కొందరు ఉద్యోగ సంఘ నాయకులు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి దాపురించిందంటే..ఏపీలో వ్యవస్థల పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం ప్రకటన వచ్చిన వెంటనే..పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ ప్రకటనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు అని, కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. వారి అభ్యంతరాలు వారు వ్యక్తం చేయవచ్చు. అయితే ఏకంగా ప్రభుత్వానికి మద్దతుగా జీ హుజూర్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం కూడా ఉంది.
వ్యక్తిగతమే లబ్ధి..
ఇటీవలే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల విషయంలో పోలీసు అధికారుల సంఘం నర్రెడ్డి చంద్రశేఖర్ ‘రెడ్డి’ స్పందించిన తీరును బట్టి నర్రెడ్డి గతంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ విషయంలో అవినీతి చేశారని తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలోజరిగింది. అప్పటి నుంచి ఆయనకు టీడీపీ అంటే పడదు. ఇక తాజాగా ఏపీలోని ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉన్న కొందరు నేతలది మరో కోణం. గతంలోనూ ఓ ఉద్యోగ సంఘం నేత చేసిన వ్యాఖ్యలు సదరు నేతకు, వైసీపికి ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. ఇందుకు గత జులైలోనే ఓ వార్త చెక్కర్లు కొట్టింది. ఆయనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ప్రభుత్వంలోనూ, ఇటు ఉద్యోగ సంఘాల్లో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే..ఆయన సదరు విభాగానికి, కొన్ని ఉద్యోగ సంఘాలకు వైసీసీ అధికార ప్రతినిధి అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. 2015 నుంచే ఆయన ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా ఫేస్ బుక్లో కామెంట్లు చేయడంతో పాటు పోస్టులూ పెట్టేవారు.
భార్య టిక్కెట్ కోసం ప్రయత్నం..
ఆయన ఉండేది హైదరాబాద్లో. సంఘ నేత కాబట్టి అటెండెన్స్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. ఆయన భార్య శ్వేత.. 2012 నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తరఫున ముషీరాబాద్ నియోజకవర్గంలో పని చేశారు. తరువాత రాష్ట్ర విభజన జరిగింది. పరిస్థితులు మారాయి. 2014లో ఎన్నికల సమయంలో ముషీరాబాద్ నుంచి ఆమెను పోటీకి దింపేందుకు అంతా సిద్ధమైంది. అయితే, ప్రభుత్వోద్యోగి భార్య కావడంతో నిబంధనలు అడ్డు వచ్చాయి. ఆ సమయంలో సదరు ఉద్యోగి సర్వీసు ఇంకా చాలా కాలం ఉండడంతో రాజీనామా చేసేందుకు ఆలోచించాల్సి వచ్చింది. దీంతో నామినేషన్ వేయకుండా ఆగారనే చర్చ నడుస్తోంది. 2012 నుంచి 2014వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ప్రచారం చేసిన సదరు ఉద్యోగి.. తరువాత చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వాటిని డిలీట్ చేశారని చెబుతారు. ఇక 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన అభిమానాన్ని చాటుకోవడంతోపాటు.. ఉద్యోగ సంఘాలపైనా ఆ రంగులను బలవంతంగా రుద్దుతున్నారన్న చర్చ మొదలైంది.
వీటిపై అడగరే..
- వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ
- డీఏ పెంపు, పెండింగ్
- 50 శాతం జీతాల బకాయిలు
- పీఆర్సీ అమలు, పెండింగ్ అలవెన్సుల క్లియర్
- ప్రతినెలా 1తారీఖున వేతనం
- ఉద్యోగులపై వేధింపులు
- ఇవీ వివాదాస్పదం..
- ఏపీలో ఆగస్టులోనే స్కూళ్లు తెరిచేసి వైసీపీ బ్యాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మాట్లాడలేదు.
- పాదయాత్ర వారోత్సవాలు, జగన్ పుట్టిన రోజున సచివాలయ ఉత్సవాలు నిర్వహిస్తుంటే కొవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదు.
- ఇళ్ల పట్టాలు, బహిరంగ సభలు పెట్టినప్పుడు కొవిడ్ గుర్తుకు రాలేదు.
- అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నపుడు నోరు మెదపలేదు.
- ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని వ్యక్తిగతంగా ఓ సంఘ అధ్యక్షుడు మాట్లాడడం.. తమ అభిమాన రాజకీయ నాయకుడికి జిందాబాద్ కొట్టడమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు సైతం రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ఆందోళన చేస్తుంటే ఆ సంఘ నాయకులు మాత్రం అధికార పార్టీ నాయకుల్లా మాట్లాడుతున్నారని ఎస్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎం దారునాయక్ గతంలోనే వ్యాఖ్యానించారు.
- ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలి వ్యవహారంలోనూ సదరు ఉద్యోగ సంఘం నేత ఏకంగా శాసన మండలి ఛైర్మన్ రూల్స్ పాటించలేదని వ్యాఖ్యానించడం..కేవలం రాజకీయ నాయకుడి ముద్రను వేసుకోవడం జరిగింది. ఛైర్మన్పై వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, అదే సమయంలో యనమలను అరెస్టు చేయమని హోమంత్రి చెపితే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.
- శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే చేసిన ఉత్సవాల కారణంగా చాలామంది రెవెన్యూ ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారు. కొందరు మరణించారు. అయినా వారు సదరు సంఘాల నాయకులకు కనిపించలేదు.
- ఉద్యోగుల హక్కుల విషయంలో సంఘాలు పనిచేయవచ్చు. కాని వ్యవస్థలను శాసించే పరిస్థితికి రావడం అంటే.. రాజకీయజోక్యం విపరీతంగా ఉండడమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
- అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ..అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో కేసు వేసింది. అయితే ఈ కేసులో సచివాలయ సంఘ ఉద్యోగులు కూడా అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారని సదరు సమితి పేర్కొంది. దీంతో సదరు సంఘ నేత భగ్గుమన్నారు. కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. తాము తరలింపునకు వ్యతిరేకం కాదనే కోణంలో వ్యాఖ్యానించారు.
- అంతేకాదు..గతంలో రాష్ట్రంలో 8 వేల నుంచి పదివేల కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ప్రభుత్వం కార్యాలయాలు పని చేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగుల్లో చాలా భయం మొదలైంది. 50శాతం స్టాఫ్ మాత్రమే కార్యాలయాలకు వచ్చేలా చూడాలని, కొవిడ్ తీవ్రంగా ఉందని సచివాలయ ఉద్యోగులు చేసిన వినతిని కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగులు ప్రాణభయం ఉన్నా.. ఉద్యోగం కోసం కార్యాలయానికి వచ్చారు. కొన్ని సంఘాలకు అప్పుడు కూడా అది సమస్యగా అనిపించలేదు. ఇప్పుడు వైసీపీకి జై కొట్టే విషయంలో పోటీపడడం ఏంటనే చర్చ మొదలైంది.
- ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇస్తే..ఇదే తరహాలో ప్రశ్నిస్తారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
- వ్యక్తిగత అజెండా..సంఘం ముసుగు
ఏపీలో సంఘాల్లో ఓ వర్గం జోక్యం ఎక్కువ కావడం, బలవంతంగా వైసీపీ రంగు రుద్దడంతో ఉద్యోగుల్లోనే ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో సచివాలయ ఉద్యోగులనే టార్గెట్ చేయించి మరీ సస్పెండ్ చేయించిన తమ తోటి ఉద్యోగులు..మళ్లీ ఎక్కడ తమకు నష్టం చేస్తారోననన్న భయంతో కొందరు మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది.
పదవిపై హామీ..
సోషల్ మీడియాలో మరో అంశంపై కామెంట్లూ కనిపిస్తున్నాయి. భార్య శ్వేతకు పదవిపై ఇప్పటికే వైసీపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక ప్రభుత్వానికి వీలైనంత బాకా ఊదేలా సదరు సంఘ నేత వ్యవహరిస్తున్నారని విమర్శలూ వస్తున్నాయి. మొత్తం మీద కొన్ని సంఘాల నేతలు వ్యవహరిస్తున్న తీరు..ఉద్యోగ సంఘాలపై ఉండే గౌరవాన్ని దిగజార్చేలా ఉంటున్నాయని, రాజకీయ పార్టీల్లా వ్యవహరిస్తే సదరు సంఘాలపై అభిమానం కూడా పోతుందనే చర్చ మొదలైంది.