బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేల్చాయి. ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం వరకూ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు సాగాయి. అసలు ఎడ్జీయే కూటమి అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దాటుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ తరవాత ఫలితాలు ఒక్కసారిగా ఎన్డీయేకు అనుకూలంగా మారాయి. బీహార్ లో ఎన్డీయే కూటమి జేడీయు,బీజేపీ అధికారం కైవసం చేసుకున్నాయి. దీంతో ఈవీఎంల పనితీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మోడీ ఓటింగ్ మెషీన్స్
బీహార్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మొదటి నుంచీ బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతోందని రాహుల్ గగ్గోలు పెడుతునే ఉన్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లో మోడీ ఓటింగ్ మెషీన్స్ వాడారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలను కొందరు నిపుణులు సమర్థిస్తున్నారు. ఈవీఎం మెషీన్లను మొత్తంగా ట్యాంపర్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలంటే 2 శాతం మెషీన్లను ట్యాంపర్ చేసినా సరిపోతుందని వారు విశ్లేషిస్తున్నారు. అన్నీ ఈవీఎంలలో ఏక పక్షంగా బీజేపీకి ఓట్లు వచ్చినా అనుమానాలు మరింత బలపడే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని మెషీన్లు ట్యాంపర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ, బీజేపీ మధ్య దూరం పెరగుతోందా?
బీహార్ లో ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉండొచ్చునంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. ఒకవైపు బీజేపీతో దోస్తీకోసం కుస్తీలు పడుతున్నట్టుగా కనిపిస్తున్న జగన్మోహన రెడ్డికి అనుకూలమైన పత్రిక కావడంతో.. సాక్షిలో వచ్చిన ఇలాంటి కథనం చర్చనీయాంశం అవుతోంది. దీనివెనుక వ్యూహం ఉండచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.
తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పరాజయం పాలైన సమయంలో ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షి పత్రికలో కథనాలు రావడం గమనార్హం.
అంటే వైసీపీ నేతలకు ఢిల్లీ బీజేపీ నేతలకు ఎక్కడో చెడినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీతో వైరం పెట్టుకునే ధైర్యం చేయకపోవచ్చు. అయితే బీజేపీని వ్యతిరేకిస్తున్న వారందరనినీ దగ్గరకు చేర్చుకోవడం ద్వారా అవకాశం దొరికినప్పుడు కేంద్రంలోని బీజేపీలో తిరుగుబాటు జెండా ఎగరవేయ వచ్చనే వ్యూహంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ను ఏపీలోని వైసీపీ అధినేత వెనకేసుకొస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి.
ఈవీఎం పనితీరుపై అనుమానాలు వద్దు…కార్తీ చిదంబరం
ఈవీఎంల పనితీరును ఎవరూ శంకించాల్సిన పనిలేదని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిబందరం చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత రాహుల్ గాంధీ ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తుంటే, అదే పార్టీకి చెందిన నేత కార్తీ చిదంబరం ఈవీఎంలపై సానుకూల ప్రకటనలు చేయడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. అనేక ఆర్థిక నేరాల్లో ఇరుక్కుని కేసులతో సతమతం అవుతున్న చిదంబరం, కార్తీ చిదంబరం బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. తీవ్రమైన ఆర్థిన నేరాల కేసుల్లో నుంచి బయటపడాలంటే బీజేపీలో చేరడం తప్ప వారికి వేరే మార్గం కనిపించడం లేదేమో. అందుకే వారు ఈవీఎంలపై బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సాక్షిలో వచ్చిన వార్తాకథనం ఇదే.

https://www.sakshi.com/telugu-news/politics/bihar-polls-whether-evm-machines-are-tampered-1326707











