బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ (82) ఇకలేరు. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ లో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పాయి ప్రభుత్వంలో ఆయన పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. 1998 పోక్రాన్ లో ఇండియా అణుపరీక్షలను నిర్వహించినప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. అణు పరీక్షలను చేయడంతో ఇండియాపై యూఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తిరిగి రెండు దేశాల మధ్య సత్సంబందాలను నిలపడంలో జస్వంత్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
రాజస్తాన్, జోధాపూర్ కు చెందిన జస్వంత్ మొదట ఆర్మీలో చేరి విధులు నిర్వర్తించారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన బీజేపీ వ్యవస్థాపనలో ప్రధాన పాత్ర పోషించారు. 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, రాజ్యసభ విపక్ష నేతగా వ్యవహరించారు. ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న ఆయన పార్టీలో కూడా కీలక బాధ్యతలను చేపట్టారు.
సస్పెండ్ చేసిన బీజేపీ
2014 వరకు బీజేపీలో తిరుగు లేని నాయకుడిగా ఆయన ఎదిగారు. కానీ ఆ ఎన్నికలలో పార్టీతో విభేదించి ఆయన బార్మర్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత మోడీ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన కాలుజారి బాత్రూంలో పడ్డారు. అప్పటి నుంచి ఆయన అంపశయ్యపైన ఉన్నారు. మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ చికిత్స తీసుకున్న ఆయన ఈ రోజు ఉదయం మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ప్రముఖులు సంతాపాలు
రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి తమ తమ సంతాపాన్ని తెలియచేశారు. జశ్వంత్ సింగ్ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి సేవలందించారని ఆయన సేవలు కోల్పోవడం దేశానికీ పెద్ద నష్టమని వారు అభిప్రాయపడ్డారు. ఆయనతో పని చేసిన సహచర ఎంపీలు, విపక్షాలు కూడా జస్వంత్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.











