కరోనా పాజిటివ్ మాటేమోగానీ వ్యాక్సిన్ ల విషయంలో కోవాగ్జిన్ కే పాజిటివ్ రెస్సాన్స్ ఎక్కువగా వస్తోంది. మార్కెట్లో ఈ వ్యాక్సిన్ కొరత ఉండటం, అనేక రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ కోసం అభ్యర్థనలు వస్తున్న నేపథ్యంలో ఈ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వ్యాక్సిన్ ఉత్పాదనలో తమకు ఎదురైన సాధక బాధకాలను ఆమె వివరించారు. తమ సంస్థలో పనిచేసే 50 మంది ఉద్యోగులు కోవిడ్ పాజిటివ్ కారణంగా విధులకు హాజరుకాలేకపోయిన విషయాన్ని ఆమె బయటపెట్టారు. కొందరు ఉద్యోగులు అందుబాటులో లేకపోయానా ఉన్న సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్ లు ఉత్పత్తి చేస్తున్నారట.
ఆమె చేసిన ఈ ట్వీట్ కు నెటిటిజన్ల నుంచి అభినందనలతో పాటు కొందరు రాళ్లు వేసే ప్రయత్నం కూడా చేశారు. అయినా తనదైన రీతిలో ఆమె వివరణ ఇచ్చారు. కోవాగ్జిన్ సరఫరాలో సమస్యలపై కొందరు రాజకీయ ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావిస్తూ వివరణ ఇవ్వగా దీనికి 9373 లైక్ లు, 2564 రీట్వీట్ లు వచ్చాయి. బుధవారం ఉదయం ఆమె ఈ ట్వీట్ చేశారు. తమపై ఈ రకమైన ఆరోపణలు చేయడంవల్ల తమ టీమ్ లో నిరాశ అలుముకున్నా 24×7 పనిచేస్తూ సత్ఫలితాలు సాధించారన్నారు. కోవాగ్జిన్ తో ప్రాణాలు కాపాడుతున్న మీరు మీ సిబ్బందికి టీకాలు ఎందుకు వేయలేదని కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
50 మందికి కరోనా వస్తే మీరేం చేస్తున్నారంటూ ఇంకొందరు ప్రశ్నించారు. మీ టీకా పనిచేయడం లేదా అన్నారు ఇంకొందరు. తాత్కాలిక నియామకాలు జరపవచ్చు కదా అంటూ మరికొందరు సూచనలు చేశారు. ఇంకో నెటిజన్ స్పందిస్తూ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఇంతలా కష్టపడుతున్న మీ ఉద్యోగులందరికీ థాంక్స్ అన్నారు. మరో వ్యక్తి ట్వీట్ చేస్తూ తన ఇద్దరు తాతలకు 75 సంవత్సరాల వయసని, వారు 5 వారాల క్రితం కోవాగ్జిన్ మొదటి డోస్ వేయించుకున్నారని, 2 వారాల క్రితం వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఈ వ్యాక్సిన్ కారణంగా వారు పెద్ద సమస్యలులేకుండా కోలుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.
ఈ నెల 10వ 18 రాష్ట్రాలకు కొవాగ్జిన్ను షిప్మెంట్స్లో పంపామని సుచిత్ర ట్విట్టర్లో పేర్కొన్నారు. తమ ఉద్దేశాలపై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదులు తమలో నిరుత్సాహం కలిగిస్తున్నాయన్నారు. భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా, అస్సాం, జమ్మూ & కాశ్మీర్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, ఢిల్లీతో సహా 18 రాష్ట్రాలకు కోవాక్సిన్ సరఫరా చేస్తోంది. ఛత్తిస్ గడ్, కర్ణాటక, తెలంగాణ, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా కోవాగ్జిన్ చేరింది.