ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు రాబోయే ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు. తిరుపతిలో బైబిల్కు, భగవద్గీతకు మధ్యే పోటీ ఉంటుందని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. బైబిల్ చేత పట్టుకుని ప్రచారం చేసే పార్టీ కావాలా, భగవద్గీత చేత పట్టుకుని ప్రచారం చేసే పార్టీ కావాలా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని, వైసీపీ మూట ముల్లే సర్దుకునేలా తరిమి కొడతామని బండి హెచ్చరించారు
మూల్యం చెల్లించుకోక తప్పదు
ఏపీలో దేవాలయాలపై దాడుల విషయంలో వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ హెచ్చరించారు. తిరుపతిలో వైసీపీ రెండు కొండలే అంటోందని, బీజేపీ ఏడు కొండల వాడా గోవిందా.. గోవిందా అంటోందని, ఎవరు కావాలో తిరుపతి ప్రజలు ఉప ఎన్నికల్లో నిర్ణయించుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు. దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదన్నారు. హిందువుల కానుకలను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బండి ఆరోపించారు. ఏపీలో దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బండి రూటు మారిందా?
ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా నోరు మెదపని తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ ఒక్కసారిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక బండి సంజయ్కు ఢిల్లీ పెద్దలు ఏపీపై కూడా ఓ కన్నేసి ఉంచాలని చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలసి వచ్చిన రెండు రోజులకే బండి సంజయ్ ఏపీలోని వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. కేంద్ర బీజేపీ బండిని ఏపీలో కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.











