మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుసబెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీని నమ్మిన బంటులుగా వ్యవహరించిన వారిలో చాలా మంది పార్టీని వీడి వెళ్లారు. పార్టీ ఓటమి నేపథ్యంలో వారు పార్టీ అధిష్ఠానంపైనా… ప్రత్యేకించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపైనా నిప్పులు చెరిగి మరీ వెళ్లిపోయారు. తాజాగా పార్టీకి వీర విధేయుడిగా ముద్రపడిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కూడా రాజీనామా చేశారు. ఇతర నేతల మాదిరిగా వైసీపీకి రాజీనామా చేసి… ఆ పార్టీకి వైరివర్గాలుగా ఉన్న పార్టీల్లో చేరకుండా ఇంతియాజ్ కాస్తంత సంయమనం పాటించారు.
ఇంతియాజ్ విషయంలో జగన్ కు ఇదొక్కటే కాస్తంత ఉపశమనం ఇచ్చిన విషయమని చెప్పక తప్పదు. ప్రజా సేవ చేయాలనుకుంటున్నానని…ఈ కారణంగానే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా ఇంతియాజ్ ప్రకటించారు. అంతేకాకుండా పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం తాను చేస్తున్న కృషికి రాజకీయాలు అడ్డుగా నిలుస్తున్నాయని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా వైసీపీలోకి ఇలా వచ్చి… అలా నిష్క్రమించిన ఇంతియాజ్.. రాజకీయాల విషయంలోనూ అదే రీతిని ప్రదర్శించారు.
కర్నూలు నగరానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్… పూర్వాశ్రమంలో ఐఏఎస్ అదికారి అన్న విషయం తెలిసిందే. కర్నూలు కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన జగన్ దృష్టిలో పడ్డారు. పనితీరులో కాస్ంత నిక్కచ్చిగానే వ్యవహరిస్తారని పేరున్న ఇంతియాజ్… మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక విజయవాడతోనూ బంధుత్వాలు కలిగిన ఇంతియాజ్… ఆ తర్వాత ఏకంగా రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టులను దక్కించుకున్నారు. కర్నూలు కలెక్టర్ గా ఉన్న సమయంలోనే జగన్ దృష్టిని ఆకర్షించిన ఇంతియాజ్… రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు.
కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ఆయన భావించారు. తన మనసులోని మాటను ఆయన జగన్ చెవిన కూడా వేయగలిగారు. ఓ నిఖార్సైన ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోకి వస్తానని, అది కూడా ఐఏఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి వస్తానంటే వద్దనే రాజకీయ నేత ఉండరు కదా. ఈ ప్రకారమే అంచనాలు కట్టిన జగన్… ఇంతియాజ్ కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇంతియాజ్ అడిగినట్టుగానే… కర్నూలు అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో జగన్ ను నమ్ముకుని విదేశాల్లో బంగారం లాంటి వ్యాపారాలను వదులుకుని వచ్చిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. అరబ్ దేశాల్లో మంచి లాభాలతో కూడిన వ్యాపారాలు చేసిన హఫీజ్… జగన్ పిలుపుతో వాటిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటును దక్కించుకున్న హఫీజ్ విజయం సాదించారు. యుక్త వయసులో మంచి రాజకీయ నేతగా ఎదుగుతున్న సమయంలోనే ఇంతియాజ్ రూపంలో వచ్చిన పరిణామానికి తలొంచిన హఫీజ్ సీటును వదిలేసుకున్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ మాదిరే ఇంతియాజ్ కూడా మట్టి కరిచారు. ఆ తర్వాత పెద్దగా వైసీపీ కార్యక్రమాల్లో కనిపించని ఇంతియాజ్.. అసలు ఎక్కడున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. ఈ క్రమంలో గురువారం ఉన్నపళంగా విజయవాడలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఇంతియాజ్… తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కూడా ప్రకటించారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని చెప్పిన ఇంతియాజ్… ఆ లక్ష్యం కోసం శ్రమించే క్రమంలోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా తెలిపారు.











