ఏపీలో కూటమి సర్కారు గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పినట్టైంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును విరమించుకుంటున్నట్లు కూటమి సర్కారు గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలపై మరింత భారం మోపేందుకు తాము ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేమన్న వాదనను కూడా కూటమి సర్కారు పరోక్షంగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జనవరి 1 నుంచే పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి రానున్నాయని కూడా ప్రచారం సాగింది. ఈ పెరిగే చార్జీలు భూముల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ప్రచారం సాగింది. అయితే జనవరి 1కి నాలుగైదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు ఇప్పుడు లేదంటూ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం… రాష్ట్ర ప్రజలకు నిజంగానే ఈ వార్త తీపి కబురును మోసుకొచ్చిందనే చెప్పాలి. అంతేకాకుండా నూతన సంవత్సర కానుకగానూ ఈ వార్తను రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు ఇప్పటికే భారీగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా నామమాత్రపు రేటు పలికే భూముల క్రయవిక్రయాలకు కూడా జనం భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. రూ.2 లక్షలకు అమ్ముడయ్యే భూమికి ఏకంగా రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోందట. అంటే… ధరలు తక్కువగా ఉన్నప్పటికీ… రిజిస్ట్రేషన్ పేరిట ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలు మాత్రం అమాంతంగా ఉంటున్నాయని ఇప్పటికే జనం గగ్గోలు పెడుతున్నారు.
ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు… త్వరలోనే భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సవరించనున్నట్లుగా తెలిపింది. ఈ వార్త విన్నంతనే రాష్ట్ర ప్రజలు పిడుగు పడ్డట్టుగానే భావించారు. అదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు. ఈలోగానే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు సంబంధించిన చర్యల కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
అయితే అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోని అన్ని రకాల భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పరిశీలన… వాటిని ఏ మేరకు పెంచవచ్చు అన్న అంశంపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాాలని అదికారుల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. అదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్ఝీలను పెంచాలని భావించిన జనవరి 1 కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది. ఇక అదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు భారీ మొత్తంలో ఉన్నాయని, ఇప్పటికే వాటిని భరించడం కష్టంగా ఉందంటూ పలు వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతలు అందాయి.
ఓ వైపు గడువు ముంచుకొస్తుండటం, మరోవైపున అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడం, ఇంకోవైపున చార్జీల పెంపు సబబు కాదంటూ వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విరమణ ప్రస్తుతానికేనా?… లేదంటే… అసలు చార్జీల పెంపును పూర్తిగా పక్కనపెట్టారా? అన్న విషయంపై అయితే స్పష్టత లేదు. దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఏదేమైనా నూతన సంవత్సర వేడుకల్లో మునిగేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు నుంచి తీపి కబురు అందిందని చెప్పక తప్పదు.











