ఏపీ బిల్డ్ కార్యక్రమం కింద విలువైన ప్రభుత్వ భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఓసారి వేలం కోసం విలువైన భూములను గుర్తించారు. అయితే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం భూముల అమ్మకాలను తెరమీదకు తెచ్చింది. విలువైన ప్రభుత్వ భూములను చౌకగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల వేలం వేయడానికి నిర్ణయించిన ధరలు ప్రతిపక్షాల విమర్శలకు ఊతం ఇస్తున్నాయి.
మార్కెట్ ధరలో సగానికే వేలం వేస్తారా?
ఏపీ బిల్డ్ లో భాగంగా గుంటూరు నగర సమీపంలో 11 ఎకరాలు, విజయవాడ నగర శివారులో 57 ఎకరాలను గుర్తించారు. అయితే ఈ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ లో ఎకరా భూమి రూ.8కోట్లు ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రం రూ.4 కోట్లు మాత్రమే. అయిన వారికి సగం ధరకే భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక గన్నవరం విమానాశ్రయం ఎదురుగా 11 ఎకరాల భూమిని కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, ఆర్టీవో కార్యాలయం వెనకాల ఎకరా రూ.9 కోట్లు ధర పలుకుతోంది. ప్రభుత్వం మాత్రం ఎకరా 3.5 కోట్లకు వేలం వేయాలని నిర్ణయించడంపై వామపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి.
వేలం వెర్రి
ప్రభుత్వ భూములు వేలం వేసే ఉద్దేశం ఉందా? లేదంటే ప్రతిపక్షాల నోటికి పనిచెప్పేందుకే వైసీపీ పెద్దలు ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏపీలో రియల్ ఎస్టేట్ పడకేసింది. భూములు కొనేవారు లేరు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం భూములు అమ్మాలని చూడటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేవని చెబుతోన్న ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వ భూములను అమ్మాలని చూడటం ద్వంద్వనీతికి నిదర్శనమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
గుంటూరులో కీలక భూముల వేలం
గుంటూరు నగర సమీపంలోని నల్లపాడులో 11 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగరానికి నీటిసరఫరాకు అవసరమైన ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించారు. నిధుల కొరతతో పనులు వాయిదా పడ్డాయి. గుంటూరుకు అతి సమీపంలో ఈ భూములు ఉండటంతో ఇక్కడి నుంచి గుంటూరు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడం తేలిక అవుతుందని ఇంజనీర్లు భావించారు. నల్లపాడులోని ప్రభుత్వ భూమి కూడా అనుకూలంగా ఉండటంతో అక్కడకు నాగార్జునసాగర్ కుడి కాలువ నీటిని తరలించి అక్కడ శుద్ధి చేసి గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చాలని భావించారు. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆ భూములను వేలం వేయాలని ప్రయత్నిస్తోంది.
దీనిపై వామపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వానికి భూములు వేలం వేసే ఉద్దేశం ఉందా? లేదంటే ప్రతిపక్షాలను వెర్రి వెంగళాయిల్ని చేయాలని చూస్తోందా తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.