గుణశేఖర్ విజన్ ఎప్పుడూ కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. బౌండ్ స్క్రిప్ట్ తో ఒకసారి ఆయన రంగంలోకి దిగిన తరువాత ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కథలోని ప్రతి విషయంపై .. ప్రతి అంశంపై ఆయన పూర్తి క్లారిటీతో ఉంటాడు. చిన్నపిల్లలతో ఆయన చేసిన ‘రామాయణం’ .. చారిత్రక చిత్రంగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ప్రస్తుతం మన టాలీవుడ్లో పౌరాణిక .. చారిత్రక చిత్రాలపై పట్టున్న దర్శకుడిగా గుణశేఖర్ కనిపిస్తున్నాడు. అలాంటి ఆయన ఇతిహాసమైన ‘మహాభారతం’ నుంచి శకుంతల – దుశ్యంతుల కథను ఎంచుకున్నాడు.

‘శాకుంతలం’ పేరుతో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక వైపున భారీ సెట్ల నిర్మాణం .. మరో వైపున నటీనటుల ఎంపిక ప్రక్రియ .. ఇంకో వైపున మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అనుభూతి ప్రధానమైన ప్రేమకథా కావ్యం కావడంతో, ప్రతిపాటను ఒక అందమైన సెలయేరుగా మార్చి .. ప్రేక్షకుల హృదయాల వైపు ప్రవహింపజేయడానికి మణిశర్మ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా ఓ పాటల పండగ అనిపించేలా ఆయన కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు.
మహాభారతంలోని ఈ కథా వస్తువు చాలా ప్రసిద్ధమైంది .. ప్రత్యేకమైంది. ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదిన కూడా ఈ కథ అందరికీ సుపరిచితమైనదే. అందువలన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నాడట. ఆ దిశగానే చకచకా పనులు జరుగుతున్నాయని అంటున్నారు. టైటిల్ రోల్ కోసం సమంతను ఎంపిక చేశారు. ఇక శకుంతలకి అనసూయ – ప్రియంవద అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. అనసూయ పాత్ర కోసం ఈషా రెబ్బాను తీసుకున్నారు. ప్రియంవద పాత్ర కోసం మరో హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక దుష్యంతుడి పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.











