రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో వ్యాజ్యం వేయాలనే నిర్ణయం మినహా మిగిలినదంతా పాత సమావేశాల్లా సేమ్ టూ సేమ్. రాజధాని విషయంలో తమ పార్టీది తొలి నుంచి ఒకే అభిప్రాయమని, రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను అన్యాయం చేయకూడదన్నదే తమ ఉద్దేశ్యమని కూడా పాత పాటకు కొత్త స్టెప్పులు వేస్తూ చెప్పారు. ఇది మినహా ఇక ఒక్కటీ ఈ సమావేశంలో చర్చకు రాకపోవడం విశేషం. జనసేన పార్టీకీ, అధ్యక్షుడికే రాజకీయంగా ఓ దిశ లేనప్పుడు ఇక నాయకులు, కార్యకర్తలకు నిర్దేశం ఏం చేస్తారంటూ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటి వరకూ స్పష్టమైన విధి విధానాలు లేకుండా… అలా ఏదో ఒకటి చేసుకుంటూనో… చేయకుండా కూర్చుంటూనో ఉంటున్నామన్నది నాయకుల మాట.
రెండేళ్లయినా ఒక్కరితో కలిసి ఉంటామా…
పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకూ ఒక్క రాజకీయ పార్టీతో కూడా కలిసి రెండేళ్లు నడవలేదని, ఇప్పుడు జనసేనను ఎవరు నమ్ముతారనేది నాయకుల ప్రశ్న. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన జనసేన కొన్నాళ్లు మాత్రమే వారితో స్నేహంగా మెలిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి విధానాలపై కన్నెర్ర చేశారు పవన్ కల్యాణ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. మళ్లీ కమ్యూనిస్టుల భావజాలమే నా భావజాలం అంటూ వారితో కలిసారని, అక్కడ కూడా కనీసం సంవత్సరమైనా నిలకడగా లేరని నాయకులు అంటున్నారు.
మళ్లీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తున్న జనసేనకు దిశే లేదని, ఇక అధ్యక్షుడు తమకు ఎలాంటి నిర్దేశం చేస్తారని నాయకుల ప్రశ్న. శుక్రవారం జరిగిన ఆన్ లైన్ సమావేశంలో పార్టీని ఎలా పటిష్ట పరచాలి, ఎలా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అనే అంశం కంటే ఇతర అంశాలపైనే మాట్లాడడం ఎలాంటి నిర్దేశమవుతుందని కొందరు నాయకులు పెదవి విరుస్తున్నారు.
శిరోముండనాన్ని ఖండించవా కల్యాణ్…
విశాఖపట్నంలో దళిత యువకుడిపై జరిగిన దాష్టీకంపై పవన్ కల్యాణ్ పెదవి విప్పకపోవడం పార్టీలోని ఆ వర్గాల వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. శిరోముండనం సంఘటనలో నిందితుడు నూతన్ నాయుడు తమ పార్టీ మనిషి కాదని మాత్రమే ప్రకటించిన జనసేన అధ్యక్షుడు కనీసం ఆ సంఘటనను ఖండించకపోవడం పార్టీలోనే వివాదాస్పదమవుతోందని జనసేన నాయకులు అంటున్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా దీనిపై స్పందించకపోవడం పార్టీకి చాలా చేటు చేస్తుందని జనసేన నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకుని పార్టీని బలపరుచుకోవాలి కాని ఇలా పున్నమికో అమావాస్యకో ఓ సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉందని వారంటున్నారు. ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పూర్తి స్ధాయిలో రాజకీయాల్లో ఉండాలని, ఓ కాలు సినిమా… మరో కాలు రాజకీయాలు అంటే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు.