పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 21న జరుపుకుంటున్నాం. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, తమ కుటుంబాలను కాదు అనుకోని దేశంలోని ప్రజల కోసం తమ ప్రాణాలను పాణంగా పెడుతున్నారు. అటువంటి త్యాగ మూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటు జరుపుకునేదే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం.
అసలు ఎందుకు జరుపుకుంటున్నారు?
ఎంతో మంది జవానులు భారత్-పాక్, భారత్-చైనా సరిహద్దుల్లో ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారు శత్రువులతో పోరాడుతూ విధుల్లో ఉండగానే అసువులు బాస్తున్నారు. అంతే కాకుండా మరెంతో మంది పోలీసులు అనేకనేక సందర్భాల్లో వారు నమ్మిన సిద్ధాంతల కోసం వారి ప్రాణాలను తృణప్రాయంగా ఆర్పిస్తున్నారు. అటువంటి వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక రోజు వారికి నివాళులు ఆర్పించడం జరుగుతుంది. ఆ రోజునే నేడు మనం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
అసలు ఈరోజే ఎందుకు జరుపుకుంటున్నాం?
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటారు. భారత్- చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా ఈరోజు మన మధ్యన ఉంది. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది.
వేడి నీటి బుగ్గ… నెత్తుటి బుగ్గ అయిన వేళ
మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నింంచడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పొయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి అమర వీరులకు నివాళులు ఆర్పించడం ఆనవాయితీ.