భారత్, పాకిస్థాన్ మధ్య పోరంటే.. అది ఏ ఆటైనా అందులో ఉన్న మజానే వేరు. మరీ ముఖ్యంగా క్రికెట్ అయితే.. అందులోనూ సుధీర్ఘకాలం తర్వాత జరిగే టోర్నీ అయితే ఇక ఆ ఉత్కంఠ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాదిని చితక్కొట్టి వరుసగా రెండో ఏడాది సైతం తమ సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. పాక్ను సొంత గడ్డపైనే కోలుకోలేని దెబ్బతీసి.. మనకెంతో ప్రీతికరమైన కప్పును ముద్దాడాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆనంద క్షణాలు ఎప్పుడెప్పుడా అని యావత్ భారతావని ఎదురు చూస్తోంది. అయితే.. అసలు ఆసియా కప్ జరుగుతుందా? అందులో టీమిండియా పాల్గొంటుందా? అంటే.. సందేహమే అనే సంకేతం వినిపిస్తోంది.
దాయాది పోరు ఎప్పటికీ ప్రత్యేకమే!
ప్రపంచమంతా ఉత్కంఠతను రేపిన భారత్-పాక్ పోరు కోసం రెండు దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడి చాలారోజులైంది! ఈ తరుణంలో అది ఎప్పుడెప్పుడా అని అందరూ నిరీక్షిస్తున్నారు. టీమిండియా ప్రపంచ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్నే లిఖించుకున్నప్పటికీ… క్రికెట్లో దిగ్గజ జట్లపై ఎన్ని విజయాలు సాధించినప్పటికీ… పాక్పై పోరు ఎప్పటికీ ప్రత్యేకమే! భారత క్రీడాభిమానులకు దాయాదిపై విజయం ఎప్పటికీ మధురమే.. ఆ జ్ఞాపకం ఎప్పటికీ పదిలమే!
Also Read ;- పాకిస్తాన్లో పుట్టిన ‘సుప్రీం’ కమిటీ సభ్యుడు.. రైతు సమ్మె పరిష్కారానికి సారధి
ఈసారికి నిరాశేనా?
ఆసియా కప్లో భారత్- పాక్ జట్లు ఆడితే చూడాలనుకున్న అభిమానులకు ఈసారి నిరాశ తప్పదేమో అనిపిస్తోంది. ఈసారి టోర్నీలో భారత్-పాక్ పోరు లేనట్లే కనిపిస్తోంది! ఈ ఏడాది జూన్లో శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా గతేడాది చాలా టోర్నీలు వాయిదా పడిన విషయం విదితమే!
గత సంవత్సరం లోటును ఈసారి తీర్చుకునే పనిలో భారత్ పడింది. దీనిలో భాగంగా ఈ ఏడాది భారీ షెడ్యూలే ఉంది. అందులో ఎన్నో ప్రతిష్టాత్మక సిరీస్ ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఆసియా కప్ జరిగే సమయంలోనే ఉంది. ఒకవేళ భారత్ తుది సమరానికి అర్హత సాధిస్తే ఈ టోర్నీ అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగడం ఒక్కటే మార్గమని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చివరిగా 2019 వన్డే ప్రపంచ కప్లో పాక్తో భారత్ తలపడింది. ఆసియా కప్లో వైదొలిగినందుకు బదులుగా స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించడం ద్వారా ప్రసారదారులకు నష్టం కలగకుండా చూడాలనేది బోర్డు ఆలోచన!
Must Read ;- గబ్బా కోటలు బద్దలు.. కుర్రాళ్ళు రాసిన చరిత్ర ఇది!