భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టు ఫలితంతో ఇరుజట్లకూ కాస్త ఉపశమనం లభించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగింది టీమ్ఇండియా. 98/2 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించి.. మరో 3 వికెట్లు కోల్పోయి 131 ఓవర్లలో 334/5 స్కోర్ సాధించింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
ఆ ఇద్దరి భాగస్వామ్యం అదుర్స్..
తొలుత కాస్త గాడి తప్పిన భారత బ్యాటింగ్ ఆ తర్వాత కుదుట పడింది. పంత్, పుజారా ఇండియా ఆటను స్థిరం చేశారు. భారత జట్టులో విహారి (23; 161 బంతుల్లో 4×4), అశ్విన్ (39; 128 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచారు. అంతకుముందు రెండో సెషన్లో పంత్ (97; 118 బంతుల్లో 12×4, 3×6), పుజారా(77; 205 బంతుల్లో 12×4) ఔటయ్యాక జోడీ కట్టిన విహారి, అశ్విన్ మరో వికెట్ పడకుండా 258 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష..
ఆఖరి సెషన్లో.. విహారి, అశ్విన్ మరింత రక్షణాత్మకంగా ఆడారు. ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చివరి వరకు క్రీజులో పాతుకుపోయారు. భారత్ను ఓటమి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఆసీస్ విజయానికి కళ్లెం వేశారు. దీంతో చివరి వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక ఆస్ట్రేలియా శనివారం 312/6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అంతకుముందు ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం సంపాదించిన సంగతి తెలిసిందే.లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు…
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, అశ్విన్ అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో.. హనుమ, అశ్విన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా వికెట్లకు అడ్డుపడ్డారు. ఈ ఇద్దరూ.. నాటి లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి 258 బంతులాడి 62 పరుగులు చేశారు.స్టీవ్ స్మిత్.. చీటింగ్ లో ఫస్ట్!
ఆసీస్ ఆటగాడు స్వీవ్ స్మిత్ ఆటలోనే కాదు.. చీటింగ్ లోనూ దిట్టేనని మరోసారి రుజువైంది. ప్రతీ క్రికెటర్ బ్యాటింగ్ చేయడానికి క్రీజ్లోకి వెళ్లిన తర్వాత ముందుగా తీసుకునేది గార్డ్. అది లెగ్ స్టిక్, మిడిల్ స్టిక్ అనేది బ్యాట్స్మన్ నిర్ణయించుకుని అంపైర్ను గార్డ్ కోరతాడు. అది సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులో క్రీజ్లో ఉన్న బ్యాట్స్మన్కు మాత్రమే తన గార్డ్ను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసీస్తో మూడో టెస్టులో పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో గార్డ్ మార్క్లను స్మిత్ మార్చేశాడు. చిన్నపాటి బ్రేక్లో స్మిత్ పంత్ బ్యాటింగ్ గార్డ్ను చెరిపేసి కొత్త గార్డ్ను కాలుతో గీశాడు. ఇది కెమెరాల్లో రికార్డయ్యింది. ఇక్కడ స్మిత్ గార్డ్ మారుస్తున్న విధానం కనిపించింది. ఇక్కడ స్మిత్ పూర్తిగా కనిపించకపోయినా గార్డ్ మార్చింది అతననే విషయం స్పష్టంగా తెలుస్తోంది.స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్ : 244 ఆలౌట్; పుజారా 50, గిల్ 50; కమిన్స్ 4 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 312/6 డిక్లేర్డ్; గ్రీన్ 84, స్మిత్ 81; సైని 2 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్: 334/5; పంత్ 97, పుజారా 77; హేజిల్వుడ్ 2 వికెట్లు











