2020.. కరోనా సంవత్సరం అని యావత్ ప్రపంచం భావించింది. 2021.. సరికొత్త సంతోషంతో నిండిపోతుందనే ఆశతో జీవించింది. కానీ.. భారత్ కు మాత్రం ఈ ఏడాది కూడా కరోనా బాధ తప్పేలా లేదు. ఎన్నో ఆశలతో ప్రారంభమైన థాయ్ లాండ్ ఓపెన్ గందరగోళానికి దారితీసింది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఇదిలా ఉంటే… అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్లను కోవిడ్ టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్స్టార్ కిడాంబి శ్రీకాంత్కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి.
బరిలోకి దిగకముందే.. ఓటమి!
యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత్ తో కరోనా ఆడేసుకుంది. పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన బ్యాడ్మింటన్లో ఇండియాకు చేదు అనుభవం ఎదురైంది. బరిలోకి దిగకముందే.. కరోనా పరీక్షల ఫలితాలు రూపంలో నిరాశ స్వాగతం పలికింది. ఆట సంగతి పక్కన పెడితే.. ముందు కరోనాను గెలవడం ఎలాగో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
తొలుత పాజిటివ్.. తర్వాత నెగిటివ్!
భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రణయ్లకు తొలుత పాజిటివ్ వచ్చింది. నమూనాలు తిరిగి పరీక్షించిన అనంతరం ప్రణయ్కు నెగెటివ్ రాగా.. సైనాకు మళ్లీ పాజిటివ్ వచ్చింది. మంగళవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో సైనాకు నెగటివ్ రావడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ కారణంగా సైనాతో పాటు ఆమె భర్త పారుపల్లి కశ్యప్లు టోర్నీకి దూరమైనట్లు మొదట ప్రకటించారు. వారి మ్యాచ్ల్ని వాకోవర్ ఇచ్చారు. అయితే సైనాకు తిరిగి నెగెటివ్ రావడంతో ఆమెతో పాటు కశ్యప్ ఆడాల్సిన మ్యాచ్ల్ని బుధవారానికి రీషెడ్యూల్ చేశారు.
ఎట్టకేలకు మార్గం సుగమం..
చివరగా చేసిన పీసీఆర్ టెస్ట్, యాంటీబాడీ టెస్టులు ప్రణయ్, సైనాలకు మార్గం సుగమం చేశాయి. వారి పీసీఆర్ పరీక్ష పాజిటివ్ వచ్చింది. కానీ యాంటీబాడీ ఐజీజీ కూడా పాజిటివే. అంటే దానర్థం ఆ వ్యక్తికి గతంలో వైరస్ వచ్చి పోయిందన్నమాట. ప్రస్తుతం వారికి ఇన్ఫెక్షన్ లేదని అర్థం. ఎల్గమల్ అనే షట్లర్ పీసీఆర్ టెస్టులో పాజిటివ్ రాగా.. యాంటీబాడీ ఐజీజీ నెగెటివ్ వచ్చింది. అంటే అతడు ఇప్పుడే వైరస్ బారిన పడ్డాడని అర్థం. దీంతో ఎల్గమల్ టోర్నీకి దూరమయ్యాడు.
‘‘నాలుగో రౌండ్ పరీక్షల్లో కొవిడ్-19 లేదని తేలడంతో సైనా, ప్రణయ్లు టోర్నీలో ఆడేందుకు మార్గం సుగమం అయింది. నెగెటివ్ వస్తే వాకోవర్ ఇవ్వకుండా మ్యాచ్లు తిరిగి నిర్వహించే విధంగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్)ను భారత బ్యాడ్మింటన్ సంఘం ఒప్పించింది. సైనా, కశ్యప్ల మ్యాచ్లు బుధవారం జరుగుతాయి. అయితే మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలపై కశ్యప్ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది’ అని బాయ్ తెలిపింది.
పీవీ సింధు, సాయిప్రణీత్ కు చుక్కెదురు..
థాయ్లాండ్ ఓపెన్లో ప్రపంచ ఛాంపియన్ పి.వి.సింధుకు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధుకు 21-16, 24-26, 13-21తో మియా బ్లిక్ఫెల్ట్ (డెన్మార్క్) షాకిచ్చింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 16-21, 10-21తో కాంటాఫాన్ (థాయ్లాండ్) చేతిలో చిత్తయ్యాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజు- అశ్విని పొన్ప్ప 21-11, 27-29, 21-16తో ఫైజల్- గ్లోరియా (ఇండోనేసియా)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని 16-21, 7-21తో కిమ్ యియాంగ్- కాంగ్ యాంగ్ (కొరియా) చేతిలో ఓడారు.