ఐ-ప్యాక్..2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి ఐప్యాక్ వ్యూహ రచన చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐప్యాక్ సంస్థ భారీగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఆ సంస్థకు నేరుగా డబ్బులు చెల్లించినట్లు కనిపించకుండా కొత్త రకం కనికట్టు విద్యను ప్రదర్శించారు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. వలంటీర్లకు శిక్షణ పేరిట రామ్ ఇన్ఫో సంస్థకు నాలుగేళ్లలో రూ.274 కోట్లు సమర్పించిన విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ డబ్బు మరో మార్గంలో ఐప్యాక్ కే చేరిందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మరో దందా వెలుగులోకి వచ్చింది. వలంటీర్లపై పర్యవేక్షణ పేరిట రామ్ ఇన్ఫోకు మరో కాంట్రాక్టు ఇచ్చి రూ.280 కోట్లు సమర్పించారు. ఈ డబ్బు కూడా రూట్ మారి ఐప్యాక్కే చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద జగన్ ప్రభుత్వంలో వలంటీర్లకు శిక్షణ, పర్యవేక్షణ పేరిట నాలుగేళ్లలో నికరంగా రూ.554 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సమర్పించారు.
వలంటీర్లపై పర్యవేక్షణ అంటే ఏంటి –
వారు ఏం పని చేస్తున్నారు? ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి డేటా సేకరించాలి? ఆ డేటాను ఎవరికి అందించాలి? అన్న అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు జగన్ ప్రభుత్వంలో రామ్ ఇన్ఫోకు రూ.280 కోట్లకు మరో కాంట్రాక్టు ఇచ్చారు. దానిపేరు మానవ వనరుల కాంట్రాక్ట్. రామ్ ఇన్ఫో యూని కార్పొరేట్ అనే సంస్థతో కన్సార్షియంగా ఏర్పడింది. ఆ సంస్థ పేరిట పర్యవేక్షణ వ్యవహారాలు నడిపించింది. మానవ వనరుల కింద రాష్ట్ర వ్యాప్తంగా 1045 మందిని ఆ సంస్థ దింపింది. మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున పనిచేశారు.
పైకి రామ్ ఇన్ఫో ప్రతినిధులుగా చెలామణి అయినా వీరంతా ఐప్యాక్కు చెందినవారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సూపర్బాస్లుగా వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్లి తాము ఫలానా ప్రతినిధులమని చెప్పి డేటా సేకరించేవారు. వీరు ఇచ్చే సమాచారాన్నే జగన్ ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో వీరంటే..కలెక్టర్లు, ఇతర అధికారులు భయపడేవారు. వీరు వస్తున్నారంటే VIP ట్రీట్మెంట్ ఇచ్చేవారు. వీరు వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక నిఘా వ్యవస్థలా పనిచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు నిర్వహించే సమావేశాల్లో సైతం అనధికార ప్రతినిధులుగా కూర్చొనేవారు.
నిజానికి రామ్ ఇన్ఫోతో ప్రభుత్వం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం..వలంటీర్ల పనితీరును పర్యవేక్షించడం వారి బాధ్యత. కానీ ప్రభుత్వ పనితీరునే పర్యవేక్షించి నివేదికలు ఇచ్చేవారు. ఆ నివేదికలు నేరుగా ఐప్యాక్కు చేరేవి. ఇలా జిల్లాల నుంచి వచ్చే నివేదికలను ఐప్యాక్ క్రోడీకరించి అంశాల వారీగా జగన్కు అందించేది. ఒక దశలో ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికల కన్నా వీరు ఇచ్చే రిపోర్టులపైనే ఎక్కువగా ఆధారపడి సీఎం హోదాలో జగన్ నిర్ణయాలు తీసుకునేవారు. పేరుకు మాత్రమే రామ్ ఇన్ఫోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ అసలు పని అంతా తెరవెనక ఐప్యాక్ నడిపించినట్టు తెలుస్తోంది. ఈ కాంట్రాక్టు కింద జగన్ సర్కారు చెల్లించిన రూ.280 కోట్లు వయా రామ్ ఇన్ఫో నుంచి ఐప్యాక్కు చేరి ఉంటాయన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదాన్ డిస్టిలరీస్తో లింక్స్ –
మానవ వనరుల కాంట్రాక్ట్ కింద రామ్ ఇన్ఫోతో కలిసి పనిచేసిన యూని కార్పొరేట్ సంస్థకు అదాన్ డిస్టిలరీస్తో ఉన్న అనుబంధం తేలాల్సి ఉంది. 2021లో ఈ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో దాని అడ్రస్ అదాన్ డిస్టిలరీస్ అడ్రస్ ఒక్కటిగానే ఉండిందని గుర్తించారు. అదాన్ డిస్టిలరీస్, యూని కార్పొరేట్ సొల్యూషన్ చిరునామాలు అప్పట్లో హైదరాబాద్లోని ప్రశాంతి హిల్స్లో ఉన్నాయి. ఇది ఖాజాగూడలో ఉంది. ఇప్పుడు ఇదే అదాన్ డిస్టిలరీస్ వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది. ఆ సంస్థకు యూని కార్పొరేట్ సంస్థతో ఉన్న అనుబంధం ఏమిటో తేలితే అసలు గుట్టు బయటకొస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు ఇలాంటి కంపెనీలు పుట్టించి వాటికి టెండర్లు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఉంటారన్న అనుమానాలున్నాయి. కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
వైసీపీతో ఐప్యాక్కు ఎనలేని అనుబంధం ఉంది. ప్రతిపక్షాలపై అబద్ధపు ప్రచారాలు చేయడం, వైసీపీకి లేని బలాన్ని ఉన్నట్లు చూపడం, అబద్ధాన్ని నిజంగా, సత్యాన్ని అవాస్తవంగా ప్రచారం చేయడం ఐప్యాక్ టీమ్కు వెన్నతో పెట్టిన విద్య. ఇలా అబద్ధాల మేడలపై జగన్కు రాజకీయంగా మేలు చేసి 2019లో అధికార పీఠంపై కూర్చోబెట్టేలా ఆ సంస్థ పనిచేసింది. అందుకు ఆయన ఎంత రుణం తీర్చుకున్నారో బయటకు చెప్పలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంస్థ సేవలను అటు వైసీపీకి, ఇటు ప్రభుత్వం కోసం వినియోగించుకున్నారు.
వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఆయన దాని శిక్షణ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించాలనుకున్నారు. అయితే రాజకీయ విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తగా రామ్ ఇన్ఫో అనే సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి ఆ సంస్థ శిక్షణ ఇచ్చింది లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఐప్యాక్ కనుసన్నల్లోనే పనిచేశారు. ఇదే తరహాలో వలంటీర్లపై పర్యవేక్షణ కాంట్రాక్టు సాగింది.











