అపజయమంటే ఎరగని దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో మరో కథను సిద్ధం చేసిన ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడు. కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 31న విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే రా కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్ధమవుతోంది. తాను తీసిన ప్రతి సినిమా లోనూ సామాజిక అంశాలను జోడించే కొరటాల ఈ సినిమాకు కూడా ఓ యూనివర్సల్ పాయింట్ ను తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
పరిశ్రమల నుంచి కెమికల్ లీక్ అయితే ఎదురయ్యే కష్టాల నేపథ్యంలో కొరటాల ఓ కథను సిద్ధం చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడని తెలుస్తోంది. ఈ కథకు ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదట. తాజాగా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కొరటాల తన పాత కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి బన్నీకి వినిపించడం దానికి స్టైలిష్ స్టార్ ఓకె చెప్పడం జరిగిందని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనబడనున్నాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే కొరటాల సినిమాలో బన్నీ జాయిన్ కానున్నాడు. కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించడం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.