కేటీఆర్.. రాష్ట్ర మునిసిపల్, ఐటీ, సమాచార శాఖ మంత్రి. సీఎం కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. వీటికి అదనపు హంగులు.. జనాన్ని ఆకట్టుకునేలా ఆయన చేసే ప్రసంగాల తీరు, ప్రజల్లో తనకున్న చరిష్మా. ఇంతే కాకుండా పార్టీలో నెంబర్2 పొజీషన్. ఇన్నీ అర్హతలు ఉన్నా.. కేటీఆర్ ఎందుకు బీజేపీపై ఆ కామెంట్లు ఎందుకు చేశారు? ఆ కాంమెంట్ల వెనుకాల రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందా? లేదా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ కంటే తాము వెనకబడిపోతున్నామనే సంకేతాలేమైనా అందాయా? బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే ఇలా కామెంట్స్ చేశారా! అనే చర్చ రాజకీయవర్గాల్లో జరగుతోంది.
కేటీఆర్ ఎందుకలా అన్నారు?
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆదివారం మీడియా ముఖంగా చేసిన కామెంట్స్ను ఒకసారి పరిశీలిస్తే.. అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు, డ్రామాలు బెడిసి కొట్టడంతో దుబ్బాక ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ డ్రామాలకు తెరలేపిందన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా బీజేపీ కుట్రలు పన్నేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్, డీజీపీ భవన్ను ముట్టడిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కన్నారు. దీంతో సరిపెట్టుకోకుండా… టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు డీజీపీ మహేందర్రెడ్డికి కలిసి బీజేపీపై ఫిర్యాదు కూడా చేశారు. ఇలా అధికార పార్టీ తీరుతో సర్వత్ర చర్చ మొదలైంది.
అధికారపార్టీ ఇంతలా కామెంట్ చేయడానికి కారణమేంటనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతివిమర్శలు సర్వసాధారణం. బీజేపీ ఏవో ఆరోపణలు టీఆర్ఎస్పై గుప్పించవచ్చు.. దానికి బదులుగా టీఆర్ఎస్ కూడా విమర్శల దాడి చేయవచ్చు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్కు ఒక రోజు ముందు పోల్మేనేజ్మెంట్ చేయకుండా ఉండేందుకే బీజేపీపై ఈ విధమైన ఆరోపణలను కేటీఆర్ చేసి ఉంటరా? అనే అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బీజేపీ నేతలు బయటకు అడుగుపెట్టకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులను చేపించడం అందులో భాగంగానే చూడాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వ్యూహంలో భాగమేనా?..
ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు రోజే ఏ పార్టీకైనా అతిముఖ్యమైన రోజు. గెలుపు ఓటములను తేల్చడానికి ఈ ఒక్క రోజు చాలా ముఖ్యమైనది. నెలల తరబడి ప్రచారం చేసినా.. ఈ ఒక్క రోజు ఉండే పోల్ మేనేజ్మెంట్ అంతా ఇంతా కాదు. మండలాలవారిగా తమ నాయులను టచ్లో ఉంటూ పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలు, ఓటర్లను ఆకర్షించడం వంటి వ్యూహాలను ఆయా పార్టీలు అమలు చేస్తుంటాయి. ఇలా చేయాలంటే తమ పార్టీ నేతలందరూ స్థానికంగా ఉంటూ చేయాల్సి ఉంటుంది. కానీ కేటీఆర్ చేసిన కామెంట్స్తో పోలీసు శాఖ రంగంలోకి దిగి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో రేపు జరిగే ఎన్నికల వ్యూహాలను బీజేపీ అమలు చేయకుండా అధికారపార్టీ పోలీసు శాఖను ఇలా ఉపయోగించుకుంటుదా అనే అనుమానాలను బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఒకవేళ బీజేపీ ఏమైన అల్లర్లకు పాల్పడుతున్నదనుకుంటే ఆ విషయం పోలీసు నిఘా వర్గాలు, ఇంటలిజెన్స్ వర్గాలకు తెలియకుండా ముందస్తుగా కేటీఆర్కు ఎలా తెలిసిందనే అనుమానాలను బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సమాచారం రావడంతోనే ఇలా బీజేపీని టార్గెట్ చేసే పనిలో టీఆర్ఎస్ పార్టీ పడిందని అంతా అనుకుంటున్నారు. హవాలా డబ్బు దొరకడం, అల్లర్ల పేర్లతో కుట్ర చేస్తుండటం లాంటి అంశాలను ఆ కోణంలోనే చూడాలంటున్నాయి బీజేపీ వర్గాలు. టీఆర్ఎస్ చేసే చర్యలతో బీజేపీపై గ్రౌండ్ లెవల్లో కాస్త సానుభూతి పెరుగుతుందే తప్పా తగ్గదంటున్నారు. ఇలాంటి ఎత్తుగడలతో టీఆర్ఎస్ పార్టీకే నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతల అరెస్టులు…
బీజేపీ కుట్రలకు పాల్పడబోతుందని టీఆర్ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్రావును ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరికొంత మంది ముఖ్య నేతలను కూడా అడుగు బయటకు పెట్టకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి నిరసగా బీజేపీ నేతలు, కార్యకర్తలు నగరవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. హయత్ నగర్లో బీజేపీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రగతి భవన్ ముట్టడిస్తారని కేటీఆర్ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలను అరెస్టులు చేయడంపై తమ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దుబ్బాక గెలుపును అడ్డుకోవడం కోసమే తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.