ఎన్నికల ముందు వరకు ఒకలా మాట్లాడి.. అధికారం చేతిలోకి రాగానే మరోలా మాట్లాడటం నేటి మన రాజకీయ నాయకులకు అలవాటైన సంగతే. నేను ఏమి చేసిన చెల్లుతుందని విర్రవీగి ఇష్టారీతిన ప్రవర్తించేసి, పాలన కొనసాగిస్తున్న తరుణంలో ఆకస్మాత్తుగా అనుకోని ఎదురు దెబ్బ తగిలి తప్పు తెలుసుకునే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు తమకు నచ్చిన పనులు చేసేసుకుంటూ వెళ్లిపోతుంటారు.
అయితే ఇందుకు పూర్తి విరుద్ధం మన ఏపీ సీఎం జగన్ ది . 2019 ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలీంగ్ ముగిసి ఫలితం రావాల్సిన సమయంలో.. నేనే గెలుస్తాను అన్న ధీమాతో ఉన్న జగన్. తన కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు ఉండాలి? అవి ఏ రంగులో ఉండాలి? లాంటి వాటి గురించి చర్చించేవారని సమాచారం.
అధికారం నా చేతికి వస్తే ఏం చేయాలి?
ఒకవేళ అధికారం నా చేతికి వస్తే ఏం చేయాలి అనే దాని గురించి జగన్ ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అలవాటు. అందుకు తగ్గట్లు నడుచుకోవడం ఆయనకు అలవాటు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతుందని చెప్పాలి. సీఎం జగన్ కు ఉన్న మరో అలవాటు ఏంటంటే…ఒకసారి ఏదైనా విషయంలో ఫిక్స్ అయిన తరువాత ఆ విషయంలో ఆయన్ను మార్చటం కష్టమంటారు.
నేను వన్స్ ఫిక్స్ అయితే నా మాట నేనే వినను
సీఎం జగన్ కు ఉన్న మరో అలవాటు ఏంటంటే…. ఏదైనా విషయంలో ఒక్కసారి ఫిక్స్ అయితే తరువాత ఆయన్ను ఆ విషయంలో మార్చడం ఇక ఎవరి తరం కాదు. దానికి తోడు ముందుగా టార్గెట్ చేసుకున్న అంశాల్ని ఏది ఏమైనా.. విషయం ఎంత దూరమైనా సరే ఫర్లేదు అనుకున్నది జరిగిపోవాల్సిందే అన్నట్లుగా ఆయన తీరు ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. జరుగుతున్న విషయాల్ని పట్టించుకోకుండా… మీరు ఏమైనా ఫరవాలేదు. నేను ముందుగా ఫిక్స్ చేసుకున్న ఎజెండాను పూర్తి చేయడమే ముఖ్య ధ్యేయంగా జగన్ భావిస్తుంటారు.
ఇప్పుడు అదే కొంప ముంచేట్టుంది…
దీంతో ఏపీలో కొత్త కొత్త సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క భారీ వర్షాలతో వరదలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. వారిని పరామర్శించాల్సింది పోయి.. వెనుకబడిన వర్గాల వారికి తమ ప్రభుత్వం ఎంత చేయూతను అందిస్తుందన్న విషయాన్ని గొప్పగా ప్రకటనల రూపంలో చెప్పుకోవడం, దాని మీద అధికారులతో సమీక్ష నిర్వహించడం చూస్తే తాను ముందుగా అనుకున్న ప్లాన్ యథాతధంగా జరగాలే తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా కనిపిస్తుంది. కొండ మీద కోతినైనా తెచ్చే సత్తా తనకుందని.. చరిత్రలో మరెవరికీ సాధ్యం కానివి జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా ఆయన మద్దతు దారులు అదే పనిగా గొప్పలు చెబుతుంటారు.
నా వారికి వస్తేనే దిక్కు లేదు.. మీ గురించి నాకెందుకు
అది నిజమేనని అనుకుంటే.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఏపీకి శాపంగా మారిన వైద్య వ్యవస్థను ఎందుకు మార్చటం లేదు. తనకు నీడ లాంటి విజయసాయికి కరోనా వస్తే హైదరాబాద్ అపోలో దిక్కు అయ్యింది. ఆ మాటకు వస్తే జగన్ ప్రభుత్వంలోని మంత్రులు మొదలుకొని ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఇలా ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా పరుగులు తీస్తూ హైదరాబాద్ కు రావాల్సిన దుస్థితి.
మరి ఇది ఎందుకు మార్చడం లేదో..
అద్భుతాలు చేయగలిగిన సీఎం జగన్.. ఏపీలో నాలుగైదు ఆసుపత్రుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. మిగిలిన రంగాల్లో చారిత్రక మార్పులకు శ్రీకారం చుడతారన్న పేరున్న జగన్.. ఏపీలో వైద్య సదుపాయాల్ని.. నాణ్యమైన వైద్యాన్ని అందించే ఆసుపత్రుల్ని ఎందుకు తేలేకపోతున్నారు? అన్నది ప్రశ్న. మొన్నటికి మొన్న మంత్రి వెల్లంపల్లి ఆరోగ్యం క్షీణిస్తే ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఆగమేఘాల మీద హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. సామాన్యులకు అందాల్సిన వైద్యం విషయంలో జరిగిన నిర్లక్ష్యాన్ని గర్తించిన జగన్ తండ్రి వైఎస్.. తాను అధికారంలోకి వచ్చినంతనే ఆరోగ్య శ్రీ.. 108 లాంటి వాటితో ప్రజలకు దగ్గర కావటమే కాదు.. వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా మారారన్నది మర్చిపోకూడదు. వైఎస్ కంటే అద్భుతాలు సాధించే సత్తా జగన్ సొంతమైనప్పుడు… వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీసే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఏపీని ఎందుకు తప్పించలేకపోతున్నట్లు?