గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోటికీ సిద్దపడుతున్న ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. రంగంలోకి దిగేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ పార్టీల అధిష్టానాల దృష్టిలో పడేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానాలకు దగ్గరగా ఉంటున్న వారి వద్ద పైరవీల కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఏ ఎన్నికల్లో అయినా తిరుగు లేకుండా గెలుపొందుతూ వస్తోంది. తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఆ పార్టీ గెలుపొందుతుందని ధీమాలో ఉన్నారు. ఇక గ్రేటర్లోనూ టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం ఉన్న కొంతమంది కార్పోరేటర్ల పనితీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంత మందికి కేటీఆర్ నేరుగా వార్నింగ్లు కూడా ఇచ్చారు. దీంతో కొత్తగా టికెట్ ఆశిస్తున్నవారు టీఆర్ఎస్ అధిష్టానం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు.
పోటీకి ఉవ్విళ్ళూరుతున్న మహిళా అధికారి
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ ఉన్నతాధికారి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో జోనల్ కమిషనర్గా ఉన్న ఆమె గ్రేటర్ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారని సిబ్బంది అంటున్నారు. ఇప్పటికే ఆమె తగిన పైరవీలు సైతం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతగా కొనసాగుతున్న ఆ అధికారిణి ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ నేతలకు సన్నిహితురాలిగా ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచిన తరువాత ఆయన స్థానంలో ఆ యూనియన్ నేతగా ఉన్న ఆమె అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తారని చెప్పుకుంటుంటారు గ్రేటర్ ఉద్యోగులు. గ్రేటర్ హైదరాబాద్లోనే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంపై తనకు మంచి పట్టు ఉందని, ఇక్కడి సమస్యలు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా పార్టీ టికెట్ కేటాయిస్తే సీటు గెలుచుకువస్తానని ఆమె ధీమాగా ఉన్నారు.
ఆమెకు అండగా ఓ మంత్రి..
ఇక ఆ మహిళా అధికారికి టికెట్ ఇప్పించే పని ఓ మంత్రి చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానానికి దగ్గరగా ఉండే ఆ మంత్రి ఇప్పటికే సదరు మహిళా అధికారికి టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చినట్టు చెప్పుకుంటున్నారు ఆయన సన్నిహితులు. గతంలోనూ ఇద్దరూ కలిసి పనిచేయడంతో ఈ మంత్రి ద్వారానే ఆమె టికెట్ వేటలో ఉన్నారు. ఇక టికెట్ కేటాయింపే కాకుండా ఏకంగా తనకు మేయర్ పీఠం ఇస్తారన్న గంపెడాశతో ఉన్నారామె. రిజర్వేషన్లలో భాగంగా హైదరాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో రిజర్వేషన్ల ఇబ్బందులు కూడా లేనందున ఈ అధికారిణికి టికెట్ ఇప్పిస్తే మేయర్ పీఠంపై కూడా కన్నేయ వచ్చన్న అభిప్రాయంలో ఆ మంత్రి ఉన్నారు. టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకునేందుకు ఆమె సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇన్ని ఆశలు పెట్టుకున్న ఆ అధికారిణి మనసులో మాట టీఆర్ఎస్ పెద్దలకు చేరుతుందా.. ఆ మంత్రి ప్రయత్నాలకు అధిష్టానం ఓకే చెబుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.