(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అవతారపురుషుడు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అయోధ్యలో శ్రీవారి ఇ ఆలయం నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించాలని అక్కడి ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది.
సుదీర్ఘ కాలం కోర్టులో నడిచిన రామజన్మభూమి స్థలం కేసు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ వారి ఆలయాలను టి టి డి నిర్మిస్తూ ధర్మ ప్రచారానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అయోధ్యలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించగానే శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. శ్రీరాముని జన్మస్థలం లో శ్రీవారి ఆలయ నిర్మాణం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
అయోధ్య రామాలయం నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందనే అంచనాలు సాగుతున్నాయి. టీటీడీ విజ్ఞప్తికి యూపీ ప్రభుత్వం నుంచి సత్వర స్పందన వచ్చి.. స్థల కేటాయింపు జరిగితే గనుక.. టీటీడీ వారి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా… అదే గడువులోగా పూర్తి చేసేయాలనే సంకల్పంతో టీటీడీ ఉన్నట్టు సమాచారం. కొంచెం కుడిఎడమగా.. రామాలయంతో పాటుగా.. వేంకటేశ్వరుని ఆలయాన్ని కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని వారు అనుకుంటున్నారు.











