కరోనా భారి నుంచి ప్రజలను రక్షించేందుకు,వారికి వ్యాక్సినేషన్ చేయించే విషయంలో జగన్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రోజూ వందలాది మంది కరోనా బారిన పడి చనిపోతున్నా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మీనమీషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. కరోనా రోగులకు కనీసం ఆక్సిజన్ కూడా సరిగా అందించలేకపోతున్నారని జూమ్ కాన్ఫరెన్సులో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో వెలుగు చూసిన ఎన్ 440 కరోనా వేరియంట్ మరింత ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. కనీసం రంగులకు పెట్టిన ఖర్చు మాదిరి కూడా వ్యాక్సినేషన్కు పెట్టడం లేదని ఆయన విమర్శించారు.
కనీస సదుపాయలు కూడా లేవు
ఏపీలో కరోనా రోగులకు కనీసం బెడ్లు, ఆక్సిజన్, మందులు కూడా అందించలేకపోతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రోజుకు 20 వేల మందికిపైగా కరోనా బారిన పడుతున్నా, క్యాబినెట్ సమావేశాల్లో కనీస ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కరోనా రోగులకు పార్టీ తరఫున భారీగా సాయం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని, పొరుగు రాష్ట్రాలు కూడా ఏపీ వారిని రానివ్వడం లేదని చంద్రబాబు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్పై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు వేలాది మంది కరోనా బారిన పడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యాలయంలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారందరికీ అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించినట్టు ఆయన తెలిపారు. వారంతా కోలుకున్నారని చంద్రబాబు వెల్లడించారు.










