కరోనాపై ప్రభుత్వ వైఫల్యాలను శాసనసభలో ఎండ గట్టడమొక్కటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఆయుధం. అయితే, ఈ ఆయుధంతో ఎన్నాళ్లు పోరాడతామంటూ కాంగ్రెస్ శాసనసభ్యులే పెదవి విరిచారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కోర్టులు మెట్టికాయలు వేసిన వేళ తాము కొత్తగా శాసనసభలో విమర్శలు గుప్పించేదేమిటంటూ సీనియర్ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించారు. అదిగో సరిగ్గా అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రం వంటి ఆయుధాన్ని తానే స్వయంగా అందజేశారు. అధికార పార్టీయే కాదు… ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఊహించనంత పెద్ద ఆయుధం ఇప్పుడు కాంగ్రెస్ చేతికి చిక్కింది. ఇంతకీ ఆ ఆయుధం ఏమిటనుకుంటున్నారా… ఏం లేదు. అందరూ ఊహించినదే అయినా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమే ఈ ఆయుధం.
అదే తెలంగాణలో వీఏవోల వ్యవస్ధను రద్దు చేయడం. రెవెన్యూ వ్యవస్థపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఏకంగా రెవెన్యూ శాఖే రద్దు చేస్తామని, బుద్ధిగా పని చేయండి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే, అలా ప్రకటించిన వారం, పది రోజుల వరకూ ఆగ్రహంగానే ఉన్న కల్వకుంట్ల వారు ఆ తర్వాత ఈ అంశంపై మిన్నకుండిపోయారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు బతుకుజీవుడా అని గుండెల మీద చేయి వేసుకున్నారు. అన్నీ సర్దుమణిగిన వేళ మళ్లీ ముఖ్యమంత్రి కనీసం మబ్బులు కూడా కనిపించకుండా వీఏవోల రద్దు తుపాను సృష్టించారు. అది కూడా తుపాను అంత వేగంగానే. సోమవారం మధ్యాహ్నం ఓ పక్క అసెంబ్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మరణాలకు సంతాపం ప్రకటిస్తున్న సమయంలోనే శాసనసభ వెలుపల వీఏవోల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అది కూడా జిల్లాల్లోని విఏవోలు తమ వద్ద ఉన్న ఫైళ్లను మధ్యాహ్నం 3 గంటల లోగా కలెక్టర్లకు అందజేయాలంటూ హుకుం జారీ చేశారు. ఇదంతా రెండు, మూడు గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. శాసనసభలో ఉన్న అధికార, ప్రతిపక్ష శాసనసభ్యలెవ్వరికీ ఈ రద్దు గురించి తెలియదు.
బంతి కాంగ్రెస్ కోర్టులో…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాగల కార్యం కామ్ గా చేసేశారు కాని, శాసనసభ జరుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షాలకు మంచి ఆయుధం ఇచ్చినట్లే కదా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు కరోనా ఒక్కటే తమ చేతిలో ఉన్న ఆయుధం అని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శాసనసభలో రెచ్చిపోయేందుకు విఏవోల వ్యవస్ధ నిర్ణయం ఓ తీపి కబురు. దీన్ని ఎంత చర్చించి ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే కాంగ్రెస్ పార్టీకి అంత లాభం వస్తుందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఈ రద్దుతో ప్రభుత్వాన్ని రుద్దేయచ్చు అని లోలోన సంతసిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గురించి తెలిసిన వారు మాత్రం “అబ్బే కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఇంతటి నిర్ణయం తీసుకున్నారంటే కేసీఆర్ అన్నీ ఆలోచించే చేస్తారు. శాసనసభ సమావేశాల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక సీఎంకు ఉండే ఆలోచనలు ఆయనకుంటాయి “ అని ముక్తాయింపు ఇస్తున్నారు. చూడాలి ఈ ఆయుధంతో కాంగ్రెస్ యుద్ధం చేస్తుందో…. దీన్ని తనకు అనుకూలంగా కేసీఆరే మార్చుకుంటారో.