భారీ అంచనాలతో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాక్స్ ఆఫీసు దగ్గర బొమ్మ దద్దరిల్లింది అనిపించుకుంది.పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 కు సీక్వల్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మొదటి నుంచి సినీ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 వేల స్క్రీన్ లలో విడుదల అయ్యింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో యష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చాప్టర్ సృష్టించిన భీభత్సం మాదిరిగానే కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా ఫాన్స్ లో పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా రాకీ భాయ్ వైలెన్స్ దెబ్బకి ధియేటర్ లు మొత్తం దద్దరిల్లాయి.
విడుదల నాటి నుంచే ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ టీజర్, ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాలో మాస్ సీన్స్ వచ్చినప్పుడల్లా సీట్లు అదిరిపోయాయి.కనురెప్ప వేస్తే ఏం మిస్ అయిపోతామో అనే ఒక ఆతృత ధియేటర్ లలోని ప్రేక్షకులలో స్పష్టంగా కనిపించింది.హీరో ఎంట్రీ మొదలు ఎండింగ్ వరకు విజిల్స్ తో ఫాన్స్ చేసిన గోల చూస్తే సినిమా పై వారికి ఉన్న అంచనాలు ఏమిటనేది తెలిసిపోయింది. ప్రధానంగా సినిమా యాక్షన్ సీన్స్ పీక్స్ కి తీసుకెళ్లగా , ఇంటర్వల్ సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
ఇక అధీరాగా సంజయ్ దత్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక హీరో యష్ , సంజయ్ దత్ ల మధ్య సన్నివేశాలు ఆధీరిపోయేలా ఉంటాయి.ఎవరికి వారు పోటీపడి చేశారు. ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్, ఫైట్స్ మాత్రం ఎవరికి వారే అనేలా చిత్రీకరించాడు దర్శకుడు. ఇక ఇతర తారాగణంలో ప్రకాష్ రాజ్, రవీణా టండన్ , రావు రమేష్, ఈశ్వరి రావు ఇలా అందరూ వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.దీనికి తోడు రవి బస్రూర్ అందించిన సంగీతం మూవీకి మరొక హైలైట్ గా నిలిచింది.
ఇక ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో తమ రివ్యూలను తెలుపుతున్నారు. సినిమాలో హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ ఇలా దేనికి అదే అదిరిపోయాయని అంటున్నారు.ఒక బ్లాక్ బస్టర్ కి సరైన సీక్వెల్ అంటే ఇదేనని, నాన్లినియర్ కథనంతో గూస్ బంప్స్ తెప్పించారని, అలాంటి సీన్స్ ప్రతి 10 నిమిషాలకి ఒకటి వస్తాయని ట్వీట్లు చేస్తున్నారు.