ఇప్పటి వరకూ అపజయం అంటూ ఎరుగని దర్శకుడు .. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఇటీవల ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో ‘ఆచార్య’ సినిమాని తిరిగి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు.
‘ఆచార్య’ తర్వాత కొరటాల ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్నాడు. అది సినిమా కోసం కాదు లెండి. ఒక వెబ్ సిరీస్ కోసం. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ లో నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నవీన్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి.. చిన్న సినిమాల్లో మంచి సినిమాగా నిలిచింది. కొరటాల శివ ఇప్పటికే ఆ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేసాడని టాక్ నడుస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందాన్ని కూడా చేసుకున్నట్టు సమాచారం. కొరటాల శివ శిష్యులలో ఒకరు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారట. ఇప్పటికే నవీన్ వెబ్ సిరీస్ స్టోరీ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని కొరటాల శివ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ నిర్మాతగాను రాణిస్తారో లేదో చూడాలి.