హైదరాబాద్ ను ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘనత ఎంతో ఉందంటూ మంత్రి కేటీఆర్ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ‘మహా’ నగరాలను కూడా తలదన్నే విధంగా హైదరాబాద్ నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ఉందని ఘనంగా ప్రకటించారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందంటూ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. కానీ 24 గంటలు గడవక ముందే ఆయన చేసిన ప్రకటనలో డొల్లతనం ఏంటో అందరికీ తెలిసివచ్చింది.
దారుణమైన పరిస్థితులు
తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. చెరువులు, కుంటలు, నాళాలు నిండిపోయి హైదరాబాద్ రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వర్షం దాటికి చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్స్టేషన్లలోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో అధికారులు ప్రజలను స్థంబాలను, వైర్లను పట్టుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.
ప్రభుత్వ చర్యలు ఏవి సారూ..
తీవ్ర వాయుగుండం రానుందని వాతావరణ శాఖ కొన్ని రోజుల కిందటే హెచ్చరించింది. ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లనుంచి ప్రజలను ఖాళీ చేయించకపోవడంతో ఓల్డ్ సిటీలో ఇళ్లు కూలి 9 మందికిపైగా మరణించారు. ఉస్మాన్ గంజ్, చాంద్రాయణ గుట్ట లాంటి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. నాళాలు పూడిక తీయకపోవడం, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో 1500కు పైగా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.
విశ్వనగరం అంటే ఇదేనా!
ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1905వ సంవత్సరంలో మన హైదరాబాద్ లో డ్రైనేజి సిస్టంకి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 116 సంవత్సరాలైనా ఆనాటి డ్రైనేజి సిస్టంనే ఇప్పటికీ వాడుతుండటం గమనార్హం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కేవలం 10 లక్షల మంది జనాభాకి సరిపోయే సిస్టంని రూపకల్పన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి మంది దాటిపోయినా ప్రభుత్వం అదే పాత విధానంలోనే ఫాలో అవుతుండటం దారుణమని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
విశ్వనగరంగా హైదరాబాద్ ను ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్ డ్రైనేజి సిస్టం సమస్యకు ఇప్పటివరకు సొల్యూషన్ ఆలోచించలేదని విమర్శలు వినబడుతున్నాయి. 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే హైదరాబాద్ లో ఎక్కడా చూసిన వర్షపు నీరే కనబడుతోంది… విశ్వనగరమంటే ఇదేనా సారూ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏ ఇతర విశ్వనగరాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవంటూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్, కేటీఆర్ ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
చంద్రబాబును చూసి నేర్చుకోండి
జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజిమెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశామని తెలంగాణ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపణలు వస్తున్నాయి. వరదలలో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలవవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు ఒక్కరూ కూడా సహాయచర్యలలో పాల్గొనలేదు. వరద బీభత్సంలో చిక్కుకున్న ప్రజలకు ఆహార సదుపాయాలు కూడా కల్పించడంలో ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
2002లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలను టీఆర్ఎస్ సర్కార్ పాటించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అన్నీ వసతులు ఏర్పాటు చేశారు. సమీక్ష సమావేశాలతో అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో బాటు వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు చంద్రబాబు అండగా నిలిచిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో కూడా భారీగా నష్టపోయిన వైజాగ్ ను కోలుకునేలా చేసిన చంద్రబాబు విజన్ చూసి నేర్చుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రకటనలకే మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్ అభివృద్ధిని చేతలలో చూపించాలని తెలంగాణ సర్కార్ కు ప్రజలు హితువు పలుకుతున్నారు!











