నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి- సీఎం మమత బెనర్జీ , బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోరు థ్రిల్లర్ మూవీని తలపించింది.ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ శ్రేణులైతే ఊపిరి బిగపట్టి ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలి ఆరు రౌండ్ల వరకు మమత బెనర్జీపై సువేందు అధికారి ఆధిక్యంలో ఉండడం, తరువాత మమత బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చినా రౌండ్ రౌండ్కి ఆధిక్యం మారుతుండడం నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసిందని చెప్పవచ్చు.17వ రౌండ్లో మమత బెనర్జీ 1200 ఓట్లతో గెలుపొందినట్టు ప్రచారం జరిగినా.. చివరికి 1736 ఓట్లతో సువేందు అధికారి గెలుపొందారు. అదే సమయంలో టీఎంసీ 213స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 76స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
నందిగ్రామ్లో తీవ్ర ఉత్కంఠ..
292 స్థానాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే 148 సీట్లు గెలవాల్సి ఉంటుంది.ఓట్ల లెక్కింపు మొదలైన సమయం నుంచి టీఎంసీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నా మమత బెనర్జీ పోటీచేసిన నందిగ్రామ్లో తొలి ఆరురౌండ్లలో మమత బెనర్జీ వెనుకంజలో ఉండాల్సి వచ్చింది. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యం మొదలైంది. ఒకానొక సమయంలో 9వేల ఆధిక్యంలోకి వెళ్లారు సువేందు. ఒక రౌండ్లో వీరి మధ్య తేడా కేవలం 6 ఓట్లే ఉన్నాయంటే పోరు ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తొలిరౌండ్లో మమత బెనర్జీకి 5790 ఓట్లు రాగా సువేందుకు 7287 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే సువేందుకు 1497 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్ ముగిసే సరికి 4557 ఓట్ల ఆధిక్యంలోకి సువేందు మూడోరౌండ్లో 7287ఓట్లతో మరింత ఆధిక్యంలోకి వెళ్లారు.నాలుగో రౌండ్ ముగిసేసరికి మమత 8వేల ఓట్ల వెనుకంజలో ఉండడంతో పార్టీలో టెన్షన్ మొదలైంది.ఆరోరౌండ్ ముగిసే సమయానికి 9వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే ఏడో రౌండ్లో 1427 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.అప్పటి నుంచి రౌండ్ రౌండ్కి ఫలితం మారుతూ వచ్చింది. 13వ రౌండ్లో 3800 ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 14 రౌండ్ల తరువాత 2331 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. 15, 16వ రౌండ్లలో సువేంధు అధికారి ఆధిక్యంలోకి రావడంతో తీవ్ర టెన్షన్ నెలకొంది.
సవాలు చేసి మరీ..
వాస్తవానికి సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్.ఆయనకు ఇక్కడ గట్టి పట్టుంది. 2016 ఎన్నికల్లో ఈయన దాదాపు 81వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మమత బెనర్జీకి నమ్మిన బంటుగా ఉన్న సువేంధు కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరడంతోపాటు మమత బెనర్జీపై, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పలు ఆరోపణలు చేశారు. సువేందుతో పాటు పలువురు కీలక నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో మమత బెనర్జీ ప్రతిష్మాత్మకంగా తీసుకుని తన నియోజకవర్గమైన భబా(వా)నీపూర్ని వదిలి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. ఈ సమయంలోసే సువేందు అధికారి కీలక వ్యాఖ్య చేశారు. మమత బెనర్జీపై 50వేల ఓట్లతో గెలుస్తానని, మమత బెనర్జీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.ఇక బీజేపీకి సవాలు చేసేందుకు మమత బెనర్జీ ఇక్కడి నుంచి పోటీకి దిగారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే.. టీఎంసీలోని పలునేతలను బీజేపీ చేర్చుకోవడంతో మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు.అదే సమయంలో పార్టీ నుంచి వెళ్లిన నేతలకు చెక్ పెట్టేలా వ్యూహాలూ మర్చారు.మమత బెనర్జీ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేసిన రాజీబ్ బెనర్జీ, రతిన్ చక్రబొర్తి, ప్రబిర్ కుమార్ ఘోసల్, యాక్టర్ రుద్రనీల్ ఘోష్ తదితరులపై గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి వారిని ఓడించారని చెప్పవచ్చు.మొత్తం మీద పార్టీయే సుప్రీం అని చెప్పిన మమత.. నందిగ్రామ్లో ఓడినా.. ఆ పార్టీ 213 స్థానాల్లో పోరాడి గెలవడంతో దేశమంతా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు మమత బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపాయి.