అంతరీక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ మూఢ నమ్మకాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. జోతిష్యం పేరుతో ఇంకా కొందరు వింత పోకడలకు పోతూనే ఉన్నారు.
దోష నివారణ పేరుతో ఓ యువకుడికి మేకతో పెళ్లి జరిపించిన ఘటన కృష్ణ జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.
నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నారు. అతడి జాతకాన్ని పరిశీలించేందుకు జోతిష్యుడిని సంప్రదించారు. ఆ కుర్రాడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉందని ఆయన వారికి వివరించారు. ఆ దోషం పోవాలంటే మేకను మనువాడితే సరిపోతుందని సూచించాడు. దీంతో జాతకాలపై నమ్మకమున్న ఆ యువకుడు మేకతో వివాహానికి రెడీ అయిపోగా, ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు. మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు.ఇదిలా ఉంటే ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా ఇంకా ఇటువంటి మూఢ నమ్మకాలు కొనసాగుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.











