అది విద్యకు సంబంధించిన కార్యక్రమం. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాంటి మార్గాలు అనుసరించాలన్న విషయంపై కీలక చర్చలు జరిగే వేదిక అది. ఓ ప్రైవేట్ టీవీ ఛానెలే నిర్వహించిన ఈ సదస్సుకు 40కి పైగా విద్యా సంస్థలు తరలివచ్చాయి. మొత్తంగా ఈ సదస్సు విద్య, విద్యార్థులకు సంబంధించినది. మరి దీనిని ఎవరు ప్రారంభించాలి? వాస్తవంగా అయితే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించాలి. అయితే శనివారం నాడు విజయవాడలో ప్రారంభమైన ఈ సదస్సును రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) ప్రారంభించారు. విద్యకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై స్వయంగా వివరణ ఇవ్వడంతో పాటుగా ప్రతి విద్యా సంబంధిత కార్యక్రమంలో పాలుపంచుకునే సురేశ్ ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు? సురేశ్ రాలేని కారణంగానే మంత్రి పేర్ని నాని వచ్చారన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కేసుల ఉచ్చులో సురేశ్..
రాజకీయాల్లోకి రాకముందు సురేశ్ తో పాటు ఆయన సతీమణి కూడా సివిల్ సర్వెంట్లు. అయితే సురేశ్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేశారు. సరే.. రాజకీయాల్లోకి రావాలంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండరాదు కదా. అందుకే సురేశ్ కూడా తన సర్కారీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లో కూడా బాగానే క్లియ్ అయ్యారు. జగన్ కేబినెట్లో కీలకమైన విద్యా శాఖను దక్కించుకున్నారు. విద్యాధికుడిగా పేరున్న సురేశ్ కు ఆ పదవి దక్కిన వైనాన్ని సీఎం హోదాలో జగన్ ఏకంగా అసెంబ్లీలోనే ఘనంగా చెప్పుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. జగన్ మాదిరే ఇప్పుడు సురేశ్ కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో చిక్కుకున్నారు. సురేశ్ తో పాటు ఆయన సతీమణిపై కూడా సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఈ కేసు నమోదు నిబంధనలకు విరుద్ధమని, కేసును కొట్టేయాలని సురేశ్ దంపతులు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వెరసి ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సురేశ్ దంపతులు తలలు పట్టుకున్నారు. ఈ కారణంగా తనకు అప్పగించిన మంత్రి పదవిని కూడా సురేశ్ సక్రమంగా నిర్వర్తించలేక సురేశ్ సతమతమవుతున్నారు.
ఎవరు లేకున్నా పేర్ని ఉన్నారుగా
జగన్ కేబినెట్ లో పేర్ని నాని ఒక్క రవాణా శాఖ మంత్రిగానే కాకుండా సమాచార, పౌర సంబంధాల శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. దానితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగానూ ఆయనే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పేర్ని నాని ఉన్నట్లే. ఈ క్రమంలో జగన్ కేబినెట్ లోని ఏ మంత్రి అందుబాటులో లేకపోయినా ఆ మంత్రి బాధ్యతల్లోకి పేర్ని ఒదిగిపోతున్నారు. అమరావతి తలాపునే ఉన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని.. ఏ కార్యక్రమానికైనా అందుబాటులో ఉండే నేతగానే లెక్క. ఈ కారణంగా కోర్టుల చుట్టూ సురేశ్ తిరుగుతూ ఉంటే.. శనివారం నాడు విజయవాడలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్ ను పేర్ని నాని ప్రారంభించారు. ఈ తరహా పరిస్థితిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి.